‘టాక్సిక్’ టీజర్ వివాదంపై స్పందించిన సెన్సార్ చీఫ్
డిజిటల్ కంటెంట్పై ప్రసూన్ జోషి కీలక వ్యాఖ్యలు
కాకతీయ, సినిమా : యష్ హీరోగా రూపొందుతున్న టాక్సిక్ సినిమా టీజర్ చుట్టూ చెలరేగిన వివాదం రోజురోజుకూ ముదురుతున్న నేపథ్యంలో, సెన్సార్ బోర్డు ఛైర్మన్ ప్రసూన్ జోషి స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అంశంపై తాను ఎలాంటి వ్యాఖ్య చేయలేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డిజిటల్ మీడియా కంటెంట్పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్లలో కనిపించే చాలా వీడియోలకు సెన్సార్ సర్టిఫికెట్ ఉండదని, అవి సెన్సార్ బోర్డు పరిధిలోకి రావని తెలిపారు. చూసే ప్రతి కంటెంట్ సెన్సార్ పొందిందే అన్న భావన నుంచి ప్రేక్షకులు బయటపడాలని సూచించారు. ఓటీటీ కంటెంట్కు కూడా సెన్సార్ ఉంటుందని చాలా మంది భావిస్తారని, కానీ అవి తమ వద్దకు రావని, వాటికి సెన్సార్ ధ్రువీకరణ ఉండదని ప్రసూన్ జోషి స్పష్టం చేశారు. ప్రజలు ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు. ఇటీవల వివాదాస్పదంగా మారిన మరో సినిమా *జన నాయగన్*పై మాట్లాడేందుకు కూడా ఆయన నిరాకరించారు. ఆ అంశం ప్రస్తుతం చట్టపరమైన పరిధిలో ఉందని, విచారణ కొనసాగుతున్నందున వ్యాఖ్యలు చేయలేమని తెలిపారు.
‘టాక్సిక్’పై ఎందుకు వివాదం?
మెగా స్టార్ యష్ కథానాయకుడిగా, గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ చిత్రానికి A Fairy Tale for Grown-Ups అనే ఉపశీర్షిక ఉంది. యష్ పాత్రను పరిచయం చేస్తూ ఇటీవల విడుదలైన గ్లింప్స్లో ఇంటిమేట్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు *కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్*కు ఫిర్యాదు చేయగా, మహిళా కమిషన్ ఈ వివాదంపై చర్యలు తీసుకొని నివేదిక ఇవ్వాలని సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. ఈ పరిణామాలతో ‘టాక్సిక్’ టీజర్ వివాదం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.


