తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు పాటించాలి
వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద
కాకతీయ,గీసుగొండ : నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సత్య శారద
సూచించారు. గ్రామ పంచాయతీ రెండవ విడత ఎన్నికలకు సంబంధించి మండలంలోని కొనాయి మాకుల, మచ్చాపూరంలలో గ్రామ పంచాయతీలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.నామినేషన్ల స్వీకరణ తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని, మొదటి అంకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాలని అన్నారు. నామినేషన్ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు. రెండవ విడత నామినేషన్ల ప్రక్రియ చివరి రోజున ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉన్నందున, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. చివరి సమయంలో ఏదైనా పొరపాటు జరిగితే నామినేషన్ తిరస్కరణకు గురవుతుందని, అందుకని అభ్యర్థులు ముందు జాగ్రత్త వహించాలన్నారు. ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే హెల్ప్ డెస్క్ ను సంప్రదించాలని సూచించారు.ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పి సీఈఓ రాం రెడ్డి, ఆర్డీఓ ఉమారాణి, తహసిల్దార్ ఎండి రియాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.


