సిరిసిల్ల పీఠంపై మళ్లీ కారు పట్టు…
చైర్మన్గా జిందం కళా చక్రపాణి, వైస్ చైర్మన్గా దార్ల సందీప్
సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్గా వరుసగా రెండోసారి కళా చక్రపాణి ఎన్నిక
వైస్ చైర్మన్ ఎంపికపై బుర్ర నారాయణ గౌడ్ అసంతృప్తి
కాకతీయ, రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల మున్సిపల్ పీఠంపై కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. చైర్మన్గా జిందం కళా చక్రపాణి ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో ఎన్నికల ప్రక్రియ పూర్తికాగా, కొత్త మున్సిపల్ కౌన్సిల్ బాధ్యతలు అధికారికంగా చేపట్టింది. ఈ విజయంతో బీఆర్ఎస్ మూడోసారి సిరిసిల్ల మున్సిపాలిటీలో అధికారాన్ని కొనసాగించింది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికపై గత కొన్ని రోజులుగా పార్టీ అంతర్గతంగా చర్చలు కొనసాగాయి. ఈ క్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్లో ఉన్న 27 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లతో సుదీర్ఘంగా సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం పార్టీ సమన్వయంతో జిందం కళా చక్రపాణిని చైర్మన్గా ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
వరుసగా రెండోసారి చైర్మన్గా కళా చక్రపాణి
క్యాంప్ నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న కౌన్సిలర్లు ముందుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జరిగిన ఎన్నికలో జిందం కళా చక్రపాణి వరుసగా రెండోసారి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. దీంతో బీఆర్ఎస్ మున్సిపల్ పాలనను కొనసాగిస్తూ మరోసారి పట్టణంపై తన పట్టు నిలబెట్టుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ స్పష్టమైన మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకుంది. మున్సిపల్ కౌన్సిల్లో కాంగ్రెస్కు ఆరుగురు, బీజేపీకి ఐదుగురు కౌన్సిలర్లు ఉండగా, ఒకరు స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. ఈ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పట్టణ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వ నిధుల సాధన కీలకంగా మారింది.
వైస్ చైర్మన్ ఎంపికపై వివాదం
వైస్ చైర్మన్ ఎంపికపై పార్టీ అంతర్గతంగా వివాదం తలెత్తింది. క్యాంప్లో వైస్ చైర్మన్గా బుర్ర నారాయణ గౌడ్ పేరును నిర్ణయించినట్లు సమాచారం. అయితే చివరి నిమిషంలో దార్ల సందీప్ను ఎంపిక చేసినట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై బుర్ర నారాయణ గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకే వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ పరిణామం బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత చర్చకు దారితీసింది. సిరిసిల్ల మున్సిపల్ రాజకీయాలు మరోసారి వేడెక్కగా, కొత్త కౌన్సిల్ పట్టణ అభివృద్ధిలో ఎంతవరకు సఫలీకృతమవుతుందన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవనుంది.



