నెలరోజుల్లో కాల్వల పనులు పూర్తి చేయాలి
రంగయ్య చెరువు అభివృద్ధిపై నిర్లక్ష్యం
లేదంటే రైతు ఉద్యమం చేపడతాం
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
ప్రాజెక్టు నిర్లక్ష్యంపై విమర్శలు.. కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరిక
కాకతీయ,నల్లబెల్లి : నెల రోజుల్లో రంగయ్య చెరువు కాలువల పనులు పూర్తి చేయకపోతే రైతుల ఉద్యమం తప్పదని పెద్ది సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామంలో కాలువల వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా రైతుల నిరసనకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనంతరం మాట్లాడారు. నల్లబెల్లి మండలంలోని రంగయ్య చెరువు ప్రాజెక్టు పనులు నిలిచిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. కాలువల నిర్మాణం, మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గోదావరి జలాలను నర్సంపేట నియోజకవర్గానికి తీసుకువచ్చి రంగయ్య చెరువును అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందేలా రూపకల్పన చేశామని చెప్పారు. తమ హయాంలో ఎక్కువ భాగం పనులు పూర్తయ్యాయని వివరించారు.
నిధులు ఉన్నా పనులు ఆలస్యం
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి చాలా కాలం గడిచినా మిగిలిన పనులు పూర్తి చేయలేదని విమర్శించారు. నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి మండలాల గ్రామాలకు సాగునీరు అందే ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఇప్పటివరకు సమీక్ష నిర్వహించలేదన్నారు. ప్రాజెక్టుకు అవసరమైన నిధులు ఇప్పటికే ఉన్నాయని తెలిపారు. వాటిని వెంటనే వినియోగించి కాలువల పనులు పూర్తి చేయాలని కోరారు. ఎండాకాలం ముగిసేలోపు పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనులు పూర్తి చేయకపోతే నర్సంపేట కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతులు ఎమ్మెల్యేను గ్రామాల్లో తిరగనివ్వరని అన్నారు. ఈ నిరసన ఆరంభమేనని, ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.


