పురుగుల మందు తాగితే గాని పత్తి కొనరా??
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐ కేంద్రాల్లో కొనుగోళ్లు నామమాత్రమే
తేమ పేరుతో సీసీఐ నిర్లక్ష్యం
కొనుగోలులో నిబంధనలు పేరిట కొర్రీలు
దళారులదే పెత్తనమంటూ ఆరోపణలు
కలెక్టర్ గారు కనికరించండి రైతుల ఆవేదన
కాకతీయ, లక్షెటిపేట : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. లక్షెటిపేట పత్తి మార్కెట్లో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రంలో కొనుగోలు ముందుకు సాగడం లేదని, సీసీఐ అధికారులకు కొనుళ్లకు కొర్రీలు పెడుతున్నారంటూ రైతులు వాపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి అమ్ముకునే అవకాశం లేకపోవడంతో అన్నదాతలు ఆవేదనకు గురవుతున్నారు. తాము చస్తే గాని పత్తిని కొనుగోలు చేయరా? ఇక్కడే ఆత్మహత్య చేసుకోవాలా? అని తమ దయనీయ పరిస్థితిని పట్టించుకునే వారే లేరంటూ మండిపడుతున్నారు. వాతావరణ ఆకస్మిక మార్పుల వలన తేమ ఏర్పడితే దానికి అన్నదాతను బలి చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం పత్తికి ప్రకటించిన మద్ధతు ధర కాకపోయినా కనీస రేటు ఎందుకు ఇవ్వడం లేదని ఆక్రోశం వెళ్ళగక్కుతున్నారు. ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వర్షానికి తడిసిన పత్తిని కూడా కొనుగోలు చేయాలని, తేమ శాతాన్ని బట్టి రైతులకు సరైన న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. కానీ సీసీఐ అధికారులు రైతులను అధిక తేమ పేరుతో వేధిస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.
బారులు తీరిన వాహనాలు..
గత కొన్నిరోజులుగా రైతులు మిల్లుకు తీసుకువచ్చిన పత్తిని అధిక తేమ పేరుతో తూకం వేయకపోవడంతో రోడ్డు పొడవునా పత్తి లోడ్ వాహనాలు బారులు తీరాయి. తక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన రైతులకు వ్యాన్ కిరాయి, వేచి ఉండే సమయం, కూలీని భరించడం తడిసిమోపెడు అవుతోంది. ఒకవైపు కొనుగోలు చేయకు మరో వైపు తమ నెంబర్ ఎప్పుడూ వస్తుందో తెలియక రైతన్నలు ఆకలి దప్పులతో మిల్లు వద్దనే పడిగాపులు కాస్తున్నారు.ఇదిలా ఉండగా తమ కంటే వెనుక వచ్చిన నెంబర్ లకు అధికారులు కాంటా చేస్తున్నారని, దళారుల ప్రమేయంతో ఇలా జరుగుతుందని ఆరోపిస్తున్నారు.
మద్ధతు ధర పై పట్టింపేది??
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, తేమ శాతం 8 నుంచి 12 వరకు ఉంటే రూ. 8110 చొప్పున క్వింటాల్ కు చెల్లించాలి. ఒకవేళ తేమ శాతం 14 నుంచి 16 మధ్యలో ఉంటే అసలు సీసీఐ అధికారులు తమను పట్టించుకోవడం లేదని, ఒక వైపు వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ లు 12 కంటే తేమ శాతం ఎక్కువ ఉంటే కూడా కొనుగోలు చేయాలని చెప్పారని రైతులు అంటున్నారు.మంత్రి, కలెక్టర్ మాటలు ఆచరణలో ఎక్కడ కనిపించడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు దళారుల వలన 13 నుంచి 16 శాతం తేమ ఉందని, పత్తిని కొనుగోలు చేయమని చెప్పడంతో రైతులు బయట ప్రైవేట్ వ్యక్తులకు రూ. 6000 నుంచి రూ. 6500 వరకు తప్పనిసరి పరిస్థితిలో అమ్ముకుంటూ తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులకు అండగా నిలువాల్సిన సీసీఐ అధికారులు తమను పట్టించుకోవడం లేదని, పైగా ప్రైవేట్ వ్యక్తుల పత్తి కొనుగోలుకు సహకరిస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా కొందరు రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వ్యక్తులు తెచ్చిన పత్తిని వెంటనే తూకం వేసి, సీసీఐ అధికారులు మిగతా రైతులను పడిగాపులు కాసేలా చేస్తున్నారని కొందరు రైతులు బాహాటంగా విమర్శిస్తున్నారు. తమకు చదువు రాకపోవడంతో తేమకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయకుండానే సంతకం చేయాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నట్లు మీడియాకు తెలిపారు. ఈ విషయమై మార్కెట్ కమిటీ కార్యదర్శి రాజేశ్వర్ ను వివరణ కోరగా, కేవలం కొనుగోలు కేంద్రం ఓపెనింగ్ రోజు మాత్రమే తేమ శాతం 12 కంటే ఎక్కువ ఉంటే కూడా కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆదేశించినట్లు తెలిపారు.ఇప్పుడు అలా కొనుగోలు చేయలేమని వెల్లడించారు. రైతులు ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేశారు.
దళారుల రాజ్యం నడుస్తుంది.
రైతు కందుల రామయ్య, గ్రామం: లక్ష్మిపూర్
ఆరు క్వింటాళ్ల పత్తికి అరగోస పెడుతున్నారు. లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన రైతు కందుల రామయ్య ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటను తేమ శాతం ఎక్కువ ఉందని, కటింగ్ ల పేరుతో రైతులను నిండా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తేమ శాతం ఎక్కువగా ఉంది కావున రిటర్న్ పంపిస్తాము సంతకం పెట్టుమని బెదిరించారని అన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రైతుకు నష్టం జరగకుండా కొనుగోలు చేయాలని కోరారు.

పూర్తిగా ఆరిన పత్తిని కూడా కొనడం లేదు.
తప్పని సత్తయ్య
గ్రామం : లక్ష్మిపూర్
పత్తిని పూర్తిగా ఆరబెట్టుకొని తెచ్చిన కూడా తేమశాతం ఎక్కువగా వచ్చింది అంటూ మా పత్తిని కొనడం లేదు. ఎండిన పత్తిని కూడా తేమ పేరుతో వెనుకకు పంపిస్తున్నారని అన్నారు. కానీ దళారులు తెచ్చిన పత్తిని మాత్రం కొనుగోలు చేస్తూ, రైతులు తెచ్చిన పత్తిని తేమ పేరుతో వెనుకకు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేమ శాతాన్ని పరిశీలించి ఒకసారి 14, మరోసారి 15 అని చెప్పి మీ పత్తిని కొనుగోలు చేయమని రిటర్న్ పంపించడం జరుగుతుందని సంతకం పెట్టమని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులు చొరవ తీర్చుకొని రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.



