కాకతీయ పరకాల: రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా రైతులకు యూరియా అందేలా చేస్తామని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం పరకాల పట్టణంలోని ఎఫ్ జె గార్డెన్స్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు సరిపడా యూరియా అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైంది తప్పా ఆచరణలో పనులు చేయడం లేదని అన్నారు. రైతులకు కావాల్సిన ఎరువులు అందుబాటులో ఉంచకుండా వారిని కష్టాలపాలు చేస్తున్నదన్నారు. వ్యవసాయం చేయాల్సిన అన్నదాతలు రాత్రి, పగలు తేడా లేకుండా సొసైటీల వద్ద యూరియా కోసం పడిగాపులు కాస్తున్నా ఈ ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యేకు చీమ కుట్టినట్లెనా లేదన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రైతులకు యూరియా అందుబాటులోకి వచ్చేదాక ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. యూరియా ఏదని అడిగిన అన్నదాతలపై అక్రమ కేసులు పెడుతున్నారు. సీఎం రేవంత్రెడ్డి రైతులను కించపరిచేలా మాట్లాడుతున్నారని, యూరియా కొరత లేదని సమస్యను పక్కదోవ పట్టించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనమన్నారు. యూరియా కోసం గోస పడుతున్న రైతుల ఉసురు ఈ ప్రభుత్వానికి తప్పకుండా తాకుతుందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్పై ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించేలా గోబెల్స్ ప్రచారం చేస్తున్నదన్నారు. కాళేశ్వరం కూలిపోయిందని అబద్ధాలు చెబుతూనే అదే ప్రాజెక్ట్ నుంచి నీళ్లను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని అన్నారు. ఘోష్ కమిషన్తో కాంగ్రెస్ పార్టీ రిపోర్ట్ తయారు చేయించి, దాని ఆధారంగా కేసీఆర్పై సీబీఐ విచారణ చేయించడం దుర్మార్గపు చర్య అని అన్నారు.
స్థానిక ఎమ్మెల్యే బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరై,శంకుస్థాపన చేసిన పనులకే మళ్ళీ శంకుస్థాపన చేసే పనిలో ఉన్నారు తప్ప కొత్తగా చేసిందేమి లేదన్నారు.అర్థరాత్రి రైతులు సొసైటీల దగ్గర ఇంత గోస పడుతుంటే ఎమ్మెల్యే ఎక్కడ పోయారని ప్రశ్నిస్తున్నానని అన్నారు.యూరియా అడిగినవారిపై కేసులు పెట్టడం కాదని వారి వద్దకు వచ్చి చేతనైతే యూరియా ఇప్పించాలని స్థానిక ఎమ్మెల్యేకు సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు , యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


