కాకతీయ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన అరెస్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని రెండేండ్లుగా చూస్తున్నాను..వారు ఇంకా అరెస్టు చేస్తామనే కలలు కంటున్నారని పేర్కొన్నారు. చూసి చూసి వాళ్ల కళ్లు కాయలు కాస్తున్నాయంటూ విమర్శించారు. తెలంగాణ భవన్ లో ఎల్ అండ్ టీ సంస్థపై మీడియాతో మాట్లాడిన సందర్భంగా కేటీఆర్ అరెస్టుపై ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు.
రేవంత్ రెడ్డి ఏం చేసినా దాని వెనకాల ఓ స్కీమ్ ఉంటుందన్నారు. అంతేకాదు దాని వెనకాల ఓ స్కామ్ కూడా ఉంటుంది. ఇది పక్కా. ఆయన పేరుకే సీఎం కానీ ఆయన దందా బ్లాక్ మెయిల్ రాజకీయాలే. ఇవాళ చెప్పింది చిన్న విషయం ఇంకో నాలుగైదు రోజుల్లో ఒక పెద్ద విషయం చెబుతాను. ఇంకో కార్పొరేట్ సంస్థను ఎలా బ్లాక్ మెయిల్ చేశాడో కూడా అది చెబుతాను. ఆధారాలతో సహా బయటపెడతాను అని కేటీఆర్ తెలిపారు.
గత రెండు రెండేళ్లుగా కాంగ్రెస్ వాళ్ల అరెస్టు చేస్తారంటూ ప్రచారం చేసి చేసి వాళ్ల కళ్లు కాయలు కాస్తున్నాయి. మిమ్మల్ని అరెస్టు చేసుకుంటారా ఏం చేసుకుంటారో చేసుకోండి. నేనేం తప్పు చేయలేదు. ఎంత ధైర్యం ఉంటే..నేనొక మంత్రిగా 10ఏళ్లు పనిచేశాను. లై డిటెక్టర్ టెస్టుకు కూడా సిద్ధమని చెప్పాను. ముఖ్యమంత్రిని అడిగాను. ఆయన ఇప్పటి వరకు స్పందించలేదు. ఇప్పుడు కూడా అదే ఆఫర్ ఇస్తున్నాను. నేను తప్పు చేయలేదు. నిజాయితీకి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. అరెస్టు చేసుకుంటారా. ఏం చేసుకుంటారో వదిలేయండి. నన్ను అరెస్టు చేస్తే పైశాచిక ఆనందం వస్తుంది కావచ్చు సీఎం రేవంత్ రెడ్డికి అది కూడా ఒకే. కానీ మేము కాంగ్రెస్ పార్టీని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టము. 4వేల పెన్షన్, తులం బంగారం, స్కూటీ ఇవన్నీ ఇచ్చే వరకు కాంగ్రెస్ ను వెంటాడుతూనే ఉంటాం. అంటూ వార్నింగ్ ఇచ్చారు.


