కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్, బీజేపీ నేతలు
కాకతీయ, పరకాల : మున్సిపల్ ఎన్నికల వేళ పరకాలలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. పరకాల మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై రెండో వార్డుకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ పార్టీల ముఖ్య నాయకులు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి వారందరికీ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు చేరుతున్నాయని, వాటికి ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు స్వచ్ఛందంగా కాంగ్రెస్లో చేరుతున్నారని తెలిపారు. పరకాల నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. రానున్న పరకాల మున్సిపాలిటీ ఎన్నికల్లో పాత, కొత్త తేడా లేకుండా అందరూ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. పరకాల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో బీఆర్ఎస్ ఇరవై రెండో వార్డు ఉపాధ్యక్షులు సాదు సురేష్, సాదు శంకర్, మడికొండ వంశీ, సోషల్ మీడియా కోఆర్డినేటర్ అనిల్, ఎండి హైమద్, రాజ్ కుమార్, రమేష్ ఉన్నారు. అలాగే బీజేపీ మైనారిటీ నాయకులు ఎండి సిరాజ్, రావుల చిన్ని, బోయిన తిరుపతి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


