ఆశీర్వదించండి
ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతా..
కేసీఆర్ నీడ నుంచి దూరం చేశారు
తెలంగాణ ఉద్యమంలో తెగించి కొట్లాడిన
బీఆర్ఎస్ కోసం ఎంతో కష్టపడ్డా..
కుట్రతో తండ్రి, పార్టీ నుంచి వేరు చేశారు
సొంత పార్టీ నేతల వల్లే నిజామాబాద్లో ఓటమి
గులాబీ కార్యకర్తలు గుండెల మీద చేయి వేసి ఆలోచన చేయండి
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
బీఆర్ఎస్ నాయకత్వంపై మరోమారు సంచలన ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు క్షమాపణలు
జాగృతి జనం బాట షురూ.. సొంత జిల్లా నుంచి పర్యటన
నాలుగు నెలలపాటు సాగనున్న యాత్ర
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ముఖ్యంగా పార్టీ నాయకత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం తన తొలి ప్రజా యాత్ర ‘జాగృతి జనం బాట’ను నిజామాబాద్ నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నీడ నుంచి తనను దూరం చేశారని, గత నాలుగైదు నెలలుగా రకరకాల రాజకీయ పరిణామాల వల్ల నేను ఇక్కడికి రాలేకపోయాను’ అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం కోసం, బీఆర్ఎస్ పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశానని, కానీ చివరకు తనకు రావాల్సిన గుర్తింపు దక్కలేదని వ్యాఖ్యానించారు. ‘నా ఓటమి స్వంత పార్టీ నేతల కుట్రనే. బీఆర్ఎస్ కార్యకర్తలు గుండెల మీద చేయి వేసి ఆలోచన చేయండి. పార్టీలో నాకు గుర్తింపు దక్కలేదు. కుట్రపూరితంగా సస్పెండ్ చేశారు’ అంటూ కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీలో కొందరు కేవలం వ్యక్తిగత లబ్ధి కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసమే కుట్రలు చేస్తున్నారని.. అందులో భాగంగానే తనను తన తండ్రి నుండి, పార్టీ నుండి దూరం చేశారని ఆరోపించారు.
అందుకే, నా దారి నేను వెతుక్కుంటున్నా..
పార్టీ సస్పెన్షన్, అంతర్గత కుట్రల నేపథ్యంలో ఆమె ఇకపై తన దారి తాను వెతుక్కుంటానని స్పష్టం చేశారు. ‘మళ్లీ ప్రజల్లోకి రావాలనుకున్నాను. నా తొలి అడుగు నిజామాబాద్ నుంచి మొదలు పెడుతున్నాను. మీ ఆశీర్వాదం నాకు కావాలి’ అంటూ ప్రజలను కోరారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ జనంబాట యాత్ర నాలుగు నెలల పాటు 33 జిల్లాల్లో కొనసాగనుంది. ఈ యాత్ర ద్వారా ప్రజల సమస్యలు, సంక్షేమ పథకాల అమలులో లోపాలపై పోరాడాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పుకొచ్చారు. ఈ పర్యటనలో అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా రైతులు, విద్యార్థులు, మహిళలు, యువతతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకుంటానని పేర్కొన్నారు.
ప్రజలు కోరుకుంటే కొత్త రాజకీయ పార్టీ ..
ప్రజలు కోరుకుంటే కొత్త రాజకీయ పార్టీ పెట్టడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. అయితే, తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలకు దక్కాల్సిన గౌరవం, ఫలితం దక్కలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో తాను ఎంపీగా, ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ.. వారికి న్యాయం చేయించడంలో పూర్తిస్థాయిలో పోరాడలేక పోయినందుకు బహిరంగ క్షమాపణ చెప్పారు. ‘ప్రతి అమరవీరుల కుటుంబానికి కోటి రూపాయల పరిహారం దక్కే వరకు తెలంగాణ జాగృతి పోరాటం కొనసాగిస్తుంది’ అని అమరవీరుల కుటుంబాలకు భరోసా కల్పించారు. కవిత తాజా వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపాయి. పార్టీలో అంతర్గత సంక్షోభాన్ని మరింత పెంచేలా కనిపిస్తున్నాయి. కవిత రాజకీయ భవిష్యత్తు, ఆమె ‘జనంబాట’ యాత్ర రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.
చేతులెత్తి క్షమాపణ కోరుతున్నా..
తెలంగాణ అమరవీరులకు.. వారి కుటుంబాలకు చేతులెత్తి క్షమాపణ కోరుతున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఏ ఆశయాల కోసం వారు ప్రాణత్యాగం చేశారో ఆ ఆశయాలు నెరవేరలేదన్నారు. 1200 మంది అమరులైతే 580 మందికి మాత్రమే న్యాయం జరిగిందని చెప్పారు. ప్రతి అమరవీరుల కుటుంబానికి రూ. 1 కోటి ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమరుల కుటుంబాలకు, తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకూ తాను పోరాటం చేస్తానని ప్రమాణం చేశారు. ‘జనం బాట’ కు బయలు దేరే ముందు హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
మేధావులతో చర్చలు
33 జిల్లాలు, 119 నియోజకవర్గాల్లో ‘జనం బాట’ పేరుతో జనం కోసం బయలుదేరుతున్నానని కవిత తెలిపారు. ప్రతి ఒక్కరికీ సమానంగా రాజకీయ, ఆర్థిక పరమైన అవకాశాలు దక్కాలని.. బీసీ రిజర్వేషన్ల కోసం జాగృతి ఇప్పటికే పోరాటం చేస్తోందని.. వాటిని సాధించుకుంటామన్నారు. అన్ని జిల్లాల్లో మేధావులను కలుస్తానని.. ఎక్కడ అభివృద్ధి ఆగిపోయిందో తెలుసుకుంటామన్నారు. జాగృతిలో ఇప్పటి వరకు పని చేసిన వాళ్లు మళ్లీ కలిసి రావాలని ఆహ్వానించారు. ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి కావాలన్నదే తన అభిమతమని అన్నారు కవిత.



