మా ప్రేమను దీవించండి
మేడారం హుండీల్లో వెలుగు చూస్తున్న కోరికల లేఖలు
చదివి ఆశ్చర్యపోతున్న లెక్కింపు సిబ్బంది
ఉద్యోగం నుంచి ప్రేమ వరకూ విన్నపాలు
కాకతీయ, హనుమకొండ : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన సమ్మక్క–సారక్క మేడారం మహాజాతర హుండీల లెక్కింపు ప్రక్రియ హనుమకొండలో ఉత్సాహంగా కొనసాగుతోంది. ప్రతి ఏటా భక్తులు సమర్పించే కానుకలతో హుండీలు నిండిపోతుంటాయి. అయితే ఈసారి హుండీల్లో డబ్బు, బంగారం, వెండి కానుకలతో పాటు భక్తులు రాసిన అనేక రకాల లేఖలు బయటపడటం విశేషంగా మారింది. హుండీల్లో కనిపిస్తున్న లేఖల్లో భక్తులు తమ వ్యక్తిగత సమస్యలను ఏకంగా అమ్మవార్లకు విన్నవించుకుంటున్నారు. ఉద్యోగాలు రెగ్యులరైజ్ కావాలని, వ్యాపారాలు అభివృద్ధి చెందాలని, పెళ్లిళ్లు త్వరగా కుదరాలని, కుటుంబ కలహాలు తొలగాలని, ఆస్తి తగాదాలు పరిష్కారం కావాలని రకరకాల కోరికలు రాసి వేస్తున్నారు. కొంతమంది తమ విన్నపాలను తెల్ల కాగితంపై రాసి హుండీలో వేయగా, మరికొందరు ఏకంగా కరెన్సీ నోట్లపైనే కోరికలు రాసి సమర్పించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒక భక్తుడు రూ.100 నోటుపై “నా కుమారుడిని బారి నుంచి కాపాడాలి తల్లి” అంటూ రాసి హుండీలో వేశాడు. మరో భక్తుడు శివరాత్రి లోపే తల్లిదండ్రుల ఆస్తి తనకు దక్కేలా చూడాలని వేడుకున్న లేఖ కూడా లభించింది.
సిబ్బందికి నవ్వులు తెప్పిస్తున్న వినూత్న విన్నపాలు
కొన్ని లేఖలు చూస్తే సిబ్బందికి నవ్వు ఆపుకోవడం కూడా కష్టమవుతోంది. ఒక ప్రేమ జంట తమ కుటుంబాలు అంగీకరించి పెళ్లికి ఒప్పుకునేలా చేయాలని వేడుకుంటూ సమ్మక్క–సారక్క తల్లుల పేరుతో లేఖ రాసింది. మరికొందరు భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలని, పిల్లలు బాగా చదవాలని, విదేశాల్లో ఉద్యోగాలు రావాలని కోరుతూ లేఖలు వేయడం కనిపిస్తోంది. హుండీ లెక్కింపులో పాల్గొంటున్న సిబ్బంది ఈ లేఖలను చదువుతూ ఆశ్చర్యపోతున్నారు. భక్తుల అపార విశ్వాసం, వారి సమస్యలను అమ్మవార్లకే చెప్పుకునే విధానం చూసి పరస్పరం చర్చించుకుంటున్నారు. “ఇంకా ఎన్ని వింత కోరికలు చూడాల్సి వస్తాయో” అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. మేడారం జాతర హుండీల లెక్కింపు ప్రక్రియ దాదాపు పది రోజులపాటు కొనసాగనుంది. ఈ కాలంలో మరెన్ని వినూత్నమైన లేఖలు బయటపడతాయోనన్న ఆసక్తి అధికారుల్లోనూ, ప్రజల్లోనూ నెలకొంది.


