తెలంగాణపై బీజేపీ నిర్లక్ష్యం
అభివృద్ధికి కేంద్రం సహకారం అవసరం
: మంత్రి పొన్నం ప్రభాకర్
కాకతీయ, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారం అందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో ఉగాది సందర్భంగా మాట్లాడిన ఆయన తెలంగాణ ఏర్పాటు సమయంలో పార్లమెంట్లో చేసిన అవమానకర వ్యాఖ్యలను గుర్తుచేశారు. రాష్ట్రాన్ని సోనియా గాంధీ కల్పించిందని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయాలను పక్కనపెట్టి తెలంగాణ పురోగతికి తోడ్పడాలని సూచించారు. మూసి నది అభివృద్ధిపై మాట్లాడుతూ నిర్వాసితులకు పూర్తి న్యాయం చేసిన తరువాతే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. పేదలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని చెప్పారు. దేశ అభివృద్ధిలో నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు చేసిన సంస్కరణలను గుర్తుచేశారు. ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రం సస్యశ్యామలం కావాలని ఆకాంక్షించారు.


