కామారెడ్డి ఘటనపై బీజేపీ ఆగ్రహం
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై దాడి కాంగ్రెస్ అరాచకానికి నిదర్శనం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలం
రామచందర్ రావు అరెస్టు పై ఖండన
కరీంనగర్లో బీజేపీ ఆందోళన, దిష్టిబొమ్మ దహనం
కాకతీయ, కరీంనగర్ : కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేయడం వారి అరాచక రాజకీయాలకు నిదర్శనమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ నేతలు వీధి రౌడీల మాదిరిగా ప్రవర్తిస్తూ రాష్ట్రవ్యాప్తంగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపుతప్పి శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. కామారెడ్డి ఘటనను నిరసిస్తూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ ఆదివారం కరీంనగర్లోని తెలంగాణ చౌక్ వద్ద బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్బంగా గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వద్దే హోంశాఖ ఉన్నప్పటికీ ప్రజల భద్రతను పరిరక్షించలేని పరిస్థితి నెలకొన్నదని, రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల రౌడీయిజం పెరిగిపోయి దాడులు, దౌర్జన్యాలు సాధారణమైపోయాయని ఆరోపించారు. శాంతిభద్రతలను పరిరక్షించలేని ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై చర్యలు తీసుకోవడం దారుణమని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధ చర్య అని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హింసాత్మక రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. ఈ ఆందోళన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిలపు రమేష్, ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు మాడ వెంకట్ రెడ్డి, నరసింహ రాజు, కార్పొరేటర్లు బోయిన్పల్లి ప్రవీణ్ రావు, బండ రమణ రెడ్డి, సోమిడి వేణు ప్రసాద్, బండారి వేణు, సౌగాల కొమురయ్య, నాంపల్లి శ్రీనివాస్, తాటి ప్రభావతి, ఎన్నం ప్రకాష్, కోడూరి చంద్ర, బీజేపీ మీడియా కన్వీనర్ కటకం లోకేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.


