బీజేపీ, బీఆర్ఎస్ చెత్త రాజకీయాలు
చెత్త సమస్యకు గత ప్రభుత్వాలే కారణం
కౌశిక్ రెడ్డి, బండి సంజయ్ డబుల్ డ్రామాలు
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని డంప్ యార్డు సమస్యపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చెత్తతో చెత్త రాజకీయాలు చేస్తున్నాయని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ తీవ్రంగా విమర్శించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో స్మార్ట్ సిటీ నిధులు దుర్వినియోగమై నగరం చెత్త కుప్పగా మారిందని ఆరోపించారు.మానేర్ రివర్ ఫ్రంట్ అభివృద్ధి పేరుతో ప్రచారం చేసుకున్న నేతలకు డంప్ యార్డు సమస్య కనిపించలేదా అని ప్రశ్నించారు. కరీంనగర్లో గుట్టలుగా చెత్త పేరుకుపోవడానికి బీఆర్ఎస్ పాలన వైఫల్యమే కారణమని పేర్కొన్నారు.డంప్ యార్డు సమస్య పరిష్కారానికి కేంద్ర పురపాలక శాఖ మంత్రితో సమావేశాలు నిర్వహించి హామీలు ఇచ్చిన బండి సంజయ్ కుమార్ ఇప్పుడు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో చెత్త తొలగిస్తామని చెప్పి ఓట్లు దండుకున్నారని ఆరోపించారు.
కరీంనగర్, హుజురాబాద్ ప్రాంతాల్లో వేర్వేరు మాటలు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని, డంప్ యార్డు సమస్య పరిష్కారానికి కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాత్రను తగ్గించి కేంద్రమే అభివృద్ధి చేస్తోందని చెప్పడం తప్పుదారి పట్టించడం అని విమర్శించారు. హుజురాబాద్లో దీక్షల పేరుతో బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రజలను మోసం చేస్తున్నారని, డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఈ రెండు పార్టీలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందని హెచ్చరించారు.డంప్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, వెస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ద్వారా చెత్త నిల్వ లేకుండా చేస్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని తప్పకుండా అమలు చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
డంప్ యార్డు విషయంలో జరుగుతున్న రాజకీయాలను ప్రజలు గుర్తించి తిప్పికొట్టాలని నరేందర్ పిలుపునిచ్చారు. సమావేశంలో పలువురు కార్పొరేటర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


