కాకతీయ, తెలంగాణ బ్యూరో: టీవీ నటుడు లోబోకు బిగ్ షాక్ తగిలింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మ్రుతితోపాటు పలువురు గాయపడటానికి కారణమైన లోబోకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ గురువారం జనగామ కోర్టు తీర్పు ఇచ్చింది. జనగామ జిల్లా రఘునాథపల్లి సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై నరేష్ లు తెలిపిన వివరాల ప్రకారం.. 2018 మే 21న ఓ ఛానెల్ తరపున వీడియో తీసేందుకు లోబో బ్రుందం రామప్ప, లక్నవరం, భద్రకాళి చెరువు, వెయ్యిస్తంభాల ఆలయం వంటి ప్రాంతాల్లో పర్యటించింది.
తర్వాత లోబో కారు నడుపుతూ వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు. ఈ సమయంలో రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టారు. ఆటోలో ప్రయాణిస్తున్న ఖిలాషాపురం గ్రామానికి చెందిన మేడె కుమార్, పెంబర్తి మణెమ్మలు తీవ్ర గాయాలతో మరణించారు. పలువురికి గాయాలు అయ్యాయి.
కారు కూడా బోల్తా పడటంతో లోబోతో పాటు బ్రుంద సభ్యులకు స్వల్పగాయాలయ్యాయి. మరణించిన వారి కుటుంబ సభ్యల ఫిర్యాదు మేరకు అప్పట్లో రఘునాథపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరి మరణానికి కారణమైన లోబోకు ఏడాది జైలు శిక్షతోపాటు రూ. 12,500 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చినట్లు పోలీసులు తెలిపారు.


