కాకతీయ, మహబూబాబాద్ టౌన్: విద్య, వైద్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ బయ్యారం మండలంలోని నామాల పాడు లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ పాఠశాల విద్యార్థుల కిచెన్ హాల్, డైనింగ్ హాల్, మ్యూజిక్ గది, తరగతి గదులను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడి బోధనాంశాల పై వారి సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు.
అదే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే పద్దతిలో పాఠాలు బోధించాలని, షెడ్యూల్ ప్రకారం సిలబస్ ను పూర్తి చేసి పాఠ్యాంశాలపై విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకోవాలని, విద్యార్ధుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని అన్నారు. మెనూ ప్రకారం పరిశుభ్రమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని అన్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు.
అనంతరం మహబూబాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని జనరల్ మేల్, ఫిమేల్ వార్డులను, పిల్లల వార్డులను తనిఖీ చేసి అక్కడి పేషెంట్ల వివరాలను, వారికి అందుతున్న వైద్య సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉండాలని, ఆసుపత్రి కు వచ్చే రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వైద్యానికి సంబంధించిన అన్ని సదుపాయాలని కల్పించాలని అన్నారు. సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందులను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు.
ఈ తనిఖీలలో కలెక్టర్ వెంట ఈ.ఎం.ఆర్.ఎస్ ప్రిన్సిపాల్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆర్.ఎం.ఓ జగదీశ్వర్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.


