అక్రమ కలప రవాణాపై దాడి
మామిడి కర్రల లోడ్ లారీ స్వాధీనం.. కేసు నమోదు
కారేపల్లి అటవీ రేంజ్ అధికారుల చర్యలు
కాకతీయ, కారేపల్లి : అనుమతులు లేకుండా అటవీ సంపదను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని కారేపల్లి రేంజ్ అధికారులు హెచ్చరించారు. అక్రమంగా మామిడి కర్ర తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కారేపల్లి అటవీ రేంజ్ పరిధిలోని పాటిమీద గుంపు బీట్ ప్రాంతంలో సోమవారం గస్తీ నిర్వహిస్తున్న సమయంలో లారీలో మామిడి కర్ర లోడ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సిబ్బందిని చూసి తప్పించుకునే ప్రయత్నం చేసినా చాకచక్యంగా అడ్డుకున్నారు.
అటవీ చట్టాల ప్రకారం అవసరమైన వాల్టా అనుమతి పత్రాలు చూపాలని కోరగా లారీ నిర్వాహకుల వద్ద ఎలాంటి పత్రాలు లేవని అధికారులు తెలిపారు. దీంతో సుమారు 60000 విలువైన మామిడి కర్రను స్వాధీనం చేసుకున్నారు. లారీని సీజ్ చేసి కారేపల్లి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలించారు.

లారీ యజమానిపై అటవీ చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అటవీ సంపదను కాపాడటంలో రాజీ పడబోమని అధికారులు స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా చెట్లను నరికినా, కలపను తరలించినా వాహనాలను సీజ్ చేసి భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఈ దాడిలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ డి శిల్ప, బీట్ ఆఫీసర్లు బి గాంధీ, ఎస్ సిద్ధారావు, ఎం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


