తహసీల్దార్గా… అవినీతి తిమింగలం!
ఏసీబీ దాడుల్లో కోట్ల అక్రమాస్తుల గుట్టు రట్టు
గజ్వేల్ తహసీల్దార్పై అక్రమాస్తుల కేసు
కరీంనగర్లో ఇళ్లు, ఫ్లాట్లు, ఖాళీ స్థలాల గుర్తింపు
కార్లు, బంగారు నగలు, లక్షల్లో నగదు స్వాధీనం
అధికార పదవిని అడ్డంగా పెట్టుకొని అక్రమ సంపాదన
నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలింపు
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : ప్రభుత్వ పదవిని అడ్డంగా ఉపయోగించి కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టిన అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కింది. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండల తహసీల్దార్ కమటం శ్రవణ్ కుమార్పై ఆదాయ వనరులకు మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శనివారం నిర్వహించిన సోదాల్లో భారీ స్థాయిలో అక్రమ సంపాదన వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ పట్టణానికి చెందిన ఈ అధికారి అధికార పదవిలో ఉండగానే అనుమానాస్పద మార్గాల్లో కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఏసీబీ అధికారులు నిందితుడి నివాసంతో పాటు మరో రెండు ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో కరీంనగర్ పట్టణంలో రెండు ఇళ్లు, ఆరు ఫ్లాట్లు కలిగిన ఒక అపార్ట్మెంట్, నాలుగు ఖాళీ స్థలాలు బయటపడ్డాయి. ఈ స్థిరాస్తుల విలువ సుమారు రూ.2,47,33,540గా అధికారులు అంచనా వేశారు. ఇక చరాస్తుల పరంగా రెండు ద్విచక్ర వాహనాలు, ఒక నాలుగు చక్రాల వాహనం, బంగారు నగలు, గృహోపకరణాలు, భారీ నగదు గుర్తించారు. రెండు ద్విచక్ర వాహనాల విలువ రూ.1,60,000గా, ఒక నాలుగు చక్రాల వాహనం విలువ సుమారు రూ.30 లక్షలుగా నమోదు చేశారు. బంగారు నగలు సుమారు రూ.4,20,000 విలువగా ఉండగా, గృహోపకరణాల విలువ రూ.15,66,000గా అంచనా వేశారు. అదనంగా రూ.11,90,000 నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో బయటపడిన స్థిర, చరాస్తుల మొత్తం విలువ సుమారు రూ.4 కోట్లకు పైగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అధికారిక అంచనాల కంటే మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని పేర్కొన్నారు. ప్రభుత్వ పదవిని దుర్వినియోగం చేసి ఈ ఆస్తులు కూడబెట్టినట్లు సోదాల్లో లభించిన పత్రాలు సూచిస్తున్నాయని తెలిపారు. ఈ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరచి న్యాయ నిర్బంధానికి తరలించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. అక్రమ సంపాదనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలికితీసేందుకు దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేసినట్లయితే ప్రజలు అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.


