- నిందితుల నుంచి మారణాయుధాలు స్వాధీనం
- గ్యాంగ్స్టర్ సురేందర్ సహా నిందితుల పట్టివేత
- భీమారం బేస్గా హన్మకొండలో కార్యకలాపాలు
కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్లో గ్యాంగ్ నడిపిస్తున్న సీరియల్ నేరస్తుడు దాసరి సురేందర్ అలియాస్ సూరి అలియాస్ మొయిన్ అలియాస్ మునీర్ (39)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాయంపేట పోలీసులు ఆదివారం ఉదయం వాహన తనిఖీల సమయంలో సురేందర్ సహా ఏడుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రెండు దేశీయ పిస్టల్స్, లైవ్ రౌండ్, మ్యాగజైన్లు, బైక్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో వరంగల్ జిల్లా పోలీస్ వర్గాల్లో కలకలం రేగింది.
వాహన తనిఖీలో పిస్టల్స్ స్వాధీనం ..
హనుమకొండ జిల్లా శాయంపేట పోలీస్ స్టేషన్ సబ్ఇన్స్పెక్టర్ జె. పరమేశ్వర్ సిబ్బందితో కలిసి శుక్రవారం ఉదయం 6.30 గంటలకు కొత్తగట్టు, సింగారం క్రాస్రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో గుడెప్పాడ్ దిశనుంచి రెండు బైక్లపై వస్తున్న ఏడుగురిని ఆపగా, వారు పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వెంటాడి పట్టుకుని విచారించగా, వారి వద్ద దేశీయంగా తయారు చేసిన తుపాకులు, మ్యాగజైన్లు, లైవ్ రౌండ్లు లభించాయి. నిందితులు దాసరి సురేందర్, సామ్రాజ్ శ్రీ చక్రి, చుంచు రాహుల్, నమిండ్ల శివమణి, రౌతు శివ వైభవ్, సామ్రాజ్ క్రాంతి, ఎనుగల నితిన్, ఆదిత్య కుమార్ ఠాకూర్ లను పోలీసులు అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. కాగా, బుడిగె తరుణ్, రేణుకుంట్ల ప్రదీప్, సాయి లక్కీ అలియాస్ సాయి శివ, లోఖి, ముస్కే రవితేజ లు పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితులు సురేందర్ వద్ద నుంచి ఐరన్ పిస్టల్, మ్యాగజైన్, లైవ్ రౌండ్, చక్రి వద్ద నుంచి దేశీయ తుపాకీ, మ్యాగజైన్, రాహుల్ వద్ద నుంచి, హోండా డియో స్కూటీ, శివమణి వద్ద నుంచి బజాజ్ పల్సర్ బైక్, నితిన్, ఆదిత్య ఠాకూర్ వద్ద నుంచిమొబైళ్లు స్వాధీనం చేసుకున్నారు.
గ్యాంగ్ కార్యకలాపాల వెల్లడి..
పోలీసుల విచారణలో సురేందర్ గ్యాంగ్ మద్యం, గంజాయి సేవిస్తూ పార్టీల్లో గాలిలోకి కాల్పులు జరిపినట్లు తేలింది. జైలులో ఉన్న సమయంలో బీహార్ రాష్ట్రానికి చెందిన ఆదిత్య ఠాకూర్ను పరిచయం చేసుకొని అతని ద్వారా తుపాకులు తెప్పించుకున్నాడు.తన అనుచరుడు భూపాలపల్లికి చెందిన బాసిత్ ముఠా యుద్ధంలో హతమైన తర్వాత, అతని సమాధి వద్ద ప్రతీకారంగా గాలిలోకి కాల్పులు జరిపారని సురేందర్, చక్రి ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
మాందారిపేట ఘటనలోనూ వీరే..!
గత నెల 18న మాందారిపేట గ్రామంలో ఒక లారీని ఆపి డ్రైవర్పై పిస్టల్తో దాడి చేసిన ఘటన, పెట్రోల్ పంప్లో రూ.200 పెట్రోల్ తీసుకుని డబ్బు చెల్లించకుండా కార్మికుడిని బెదిరించిన ఘటనల్లోనూ ఇదే గ్యాంగ్ పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత వీరు హైదరాబాద్ పారిపోయి, తిరిగి హన్మకొండకు వచ్చి కేసు ఉపసంహరించుకునేందుకు పెట్రోల్ బంక్ ఉద్యోగిని బెదిరించాలని ప్లాన్ చేసినట్లు తేలింది. కాగా, వీరు గంజాయి సేవించినట్లు నిర్ధారణ చేశారు. వీరిపై హత్యలు, దోపిడీలు, అత్యాచారం, చోరీలు, పీడీ చట్టం, పోక్సో చట్టం కింద 40కి పైగా కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 2008 నుంచి 2022 వరకు చౌట్ అప్పల్, బోయినపల్లి, మాధాపూర్, మీర్పేట, ఎల్బీ నగర్, హయత్నగర్, నార్సింగ్, బాలాపూర్ తదితర స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. శాయంపేట ఎస్ఐ జె. పరమేశ్వర్ మాట్లాడుతూ.. నిందితులు అక్రమంగా తుపాకులు దాచుకొని భయ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేశారన్నారు. వీరిపై ఆర్మ్స్ యాక్ట్, ఎన్ డి పి ఎస్ యాక్ట్, కొత్త బి ఎన్ ఎస్ చట్టాల కింద కేసులు నమోదు చేశాం. పరారీలో ఉన్న వారిని కూడా త్వరలో పట్టుకుంటామని తెలిపారు.


