మేడారం చిలకలగుట్టలో ఏర్పాట్లు
క్షేత్రస్థాయిలో ఎస్పీతో కలిసి మంత్రి సీతక్క పరిశీలన
చిలకలగుట్టలో భక్తుల రాకపోకలపై అధికారులకు సూచనలు
ట్రైబల్ మ్యూజియం పనుల పురోగతిపై సమీక్ష
భక్తులకు లోటుపాట్లు లేకుండా ప్రత్యేక చర్యలు
భద్రతకే ప్రథమ ప్రాధాన్యం : మంత్రి సీతక్క
కాకతీయ, ములుగు ప్రతినిధి :శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతర సమీపిస్తున్న నేపథ్యంలో మేడారంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల ఏర్పాట్లను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తయ్యేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర, జిల్లా ఎస్పీ *సుధీర్ రామ్నాథ్ కేకన్*లతో కలిసి మేడారం పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు.

చిలకలగుట్టలో ఏర్పాట్ల పరిశీలన
ముందుగా చిలకలగుట్ట ప్రాంతాన్ని సందర్శించిన మంత్రి, అక్కడ భక్తుల రాకపోకలు, భద్రతా ఏర్పాట్లు, తాగునీరు, రహదారులు తదితర మౌలిక సదుపాయాల పరిస్థితిని పరిశీలించారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అదనపు భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ట్రైబల్ మ్యూజియాన్ని సందర్శించిన మంత్రి, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. జాతరకు వచ్చే భక్తులకు గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు తెలియజేసేలా మ్యూజియాన్ని సిద్ధం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, మద్యం సేవించి జంపన్న వాగులోకి వెళ్లవద్దని భక్తులకు హెచ్చరించారు. మేడారం చేరుకున్న వెంటనే జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి, అనంతరం అమ్మవార్ల దర్శనం చేసుకుని వంటావార్పు నిర్వహించుకోవాలని సూచించారు. రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో భక్తులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
చిన్నపిల్లలు, వృద్ధులపై ప్రత్యేక జాగ్రత్తలు
జాతర సమయంలో చిన్నపిల్లలు, వృద్ధులను ఒంటరిగా ఎక్కడికీ వదిలివేయకూడదని మంత్రి స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులు అందరూ కలిసే ఉండాలని, ఎవరికైనా దారి తప్పితే వెంటనే సమీపంలోని పోలీసు సిబ్బంది లేదా అధికారులను సంప్రదించాలని సూచించారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే మహాజాతరలో తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, దర్శన సౌకర్యాలు వంటి అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా భక్తుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సీతక్క మరోసారి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


