వ్యాధి నిరోధక వంగడాలు వాడాలి..
*రైతు శిక్షణ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు
కాకతీయ,గీసుగొండ: పంటలను వ్యాధుల నుంచి రక్షించుకోవడంతో పాటు దిగుబడులు పెంచుకోవాలంటే రైతులు వ్యాధి నిరోధక వంగడాలను తప్పనిసరిగా ఉపయోగించాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం పత్తి శాస్త్రవేత్త డాక్టర్ వెంకన్న సూచించారు.మండలంలోని కొనాయిమకుల రైతు వేదికలో నిర్వహించిన రైతు శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జాతీయ ఆహార భద్రత మిషన్ జిల్లా కన్సల్టెంట్ సారంగం వరిలో తక్కువ కాలంలో కోతకు వచ్చే, అగ్గితెగులు, బ్లైట్ వంటి వ్యాధులను తట్టుకునే రకాల ఎంపికపై అవగాహన కల్పించారు. గీసుగొండ ఉద్యాన అధికారి ఎం. తిరుపతి ఆయిల్ పంటలు మరియు ఉద్యాన పథకాలపై వివరించగా, ఇఫ్కో సంస్థ ప్రతినిధి జీవన్ నానో ఎరువుల వినియోగంపై, పట్టుచీరల శాఖ అధికారి అరవింద్ పట్టు పరిశ్రమ అవకాశాలపై వివరించారు. మండల వ్యవసాయ అధికారి పి. హరి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొని శిక్షణ పొందారు.


