స్వతంత్ర అభ్యర్థి సంచలనం
19వ వార్డులో గోస్కుల రాజ్కుమార్ ఘన విజయం
ప్రధాన పార్టీల పోటీ తట్టుకొని గెలిచిన వైనం
కాకతీయ, హుజురాబాద్ : హుజూరాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉండగా, ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్యే పోటీ కేంద్రీకృతమైంది. ఎక్కువ వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు సాగింది. అయితే ఈ రాజకీయ సమీకరణాలకు భిన్నంగా 19వ వార్డులో మాత్రం స్వతంత్ర అభ్యర్థి గోస్కుల రాజ్కుమార్ ఘన విజయం సాధించడం ప్రత్యేకతగా నిలిచింది.
ప్రధాన పార్టీల ప్రభావం ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లోనూ స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించడం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీ గుర్తులకు అతీతంగా వ్యక్తిత్వం, సేవా కార్యక్రమాలనే ప్రజలు ప్రాధాన్యంగా తీసుకున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వార్డు కౌన్సిలర్గా గెలిచిన అనంతరం రాజ్కుమార్ మాట్లాడుతూ… తనను నమ్మి గెలిపించిన వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వార్డులో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారం, రహదారుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. 30 వార్డుల్లో ప్రధాన పార్టీలే ఆధిపత్యం చాటిన వేళ, 19వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం హుజూరాబాద్ రాజకీయాల్లో ప్రత్యేకతగా నిలిచింది.


