సరుకులన్నింటికీ జండా పాట పెట్టాలి
మిర్చి క్వింటాకు 25వేల రూపాయల మద్దతు ధర ప్రకటించాలి
ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్
ఎనుమాముల మార్కెట్ ను సందర్శించిన ఏఐకేఎఫ్ ప్రతినిధి బృందం
కాకతీయ, వరంగల్ : మార్కెట్ కు రైతులు తీసుకువచ్చే సరుకులు అన్నింటికీ జెండా పాట పెట్టాలని ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు. గురువారం అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకెఎఫ్) రాష్ట్ర ప్రతినిధి బృందం వరంగల్ ఏనుమాముల మార్కెట్ ను సందర్శించి పంటల క్రయవిక్రయాలను, రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మార్కెటింగ్ అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడుని కలిసి మెమోరాండం ఇచ్చారు.
ఈ సందర్భంగా పి రమేష్ మాట్లాడుతూ రైతులు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే మార్కెట్లో సరైన ధర రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. మార్కెట్కు తీసుకువచ్చిన సరుకులకు జెండా పాట పేరుతో మోసం చేస్తున్నారని చెప్పారు. కేవలం ఒకటి రెండు సరుకులకే పాట వర్తింపజేసి మెజారిటీ రైతాంగానికి అధిక వ్యత్యాసంతో కొనుగోలు చేస్తూ రైతులకు తీవ్రమైన నష్టాన్ని చేకూర్చుతున్నారని వెల్లడించారు. మిర్చి కొనుగోళ్లకు ఎలాంటి ప్రమాణాలు లేకపోవడంతో మిర్చి వ్యాపారులు తమ ఇష్టానుసారంగా ధరలను నిర్ణయిస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో మిర్చికి మంచి డిమాండ్ ఉన్నదని అదే సందర్భంలో గతంతో పోల్చితే పంట విస్తరణ దిగుబడి తగ్గిందని ఇలాంటి పరిస్థితుల్లో కుంటి సాకులతో రైతులు పండించిన మిర్చికి ధరను తగిన స్థాయిలో నిర్ణయించకపోవడం అన్యాయమని అన్నారు. జెండా పాటపై కొద్దిపాటి వ్యత్యాసంతో కొనుగోలు చేసి రైతులందరికీ న్యాయం చేయాలని వెల్లడించారు. అలాగే మిర్చికి కనీస మద్దతు ధర కింటాకు 25 వేల రూపాయలు ప్రకటించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్లో రైతుల పంటలను తక్కువ ధరకు కొనుగోలు చేసి నష్టపరిచి మోసం చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో ఏఐకేఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్ రెడ్డి హంస రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కుసుంబా బాబురావు, జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఇస్మాయిల్, ఏఐసిటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముక్కెర రామస్వామి, సుంచు జగదీశ్వర్, రైతు సంఘం నాయకులు మంద రవి, కర్ర రాజిరెడ్డి, ఐతం నాగేష్, మొగిలి శ్రీనివాస రావు, పరిమళ గోవర్ధన్ రాజు, సోమిడి రవి, పేర బోయిన ఐలోని, నరసయ్య, ప్రభాకర్ పాల్గొన్నారు.


