పోరాటాలతోనే హక్కుల సాధన..!
మహిళలపై ఇంకా కొనసాగుతున్న వివక్ష
మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఏపూరి లతాదేవి
కాకతీయ, ఖమ్మం : పోరాటాల ద్వారానే మహిళా హక్కులు సాధ్యమవుతాయని మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఏపూరి లతాదేవి అన్నారు. సుదీర్ఘ కాలం పోరాడి సాధించుకున్న హక్కులు ప్రస్తుత పాలనలో క్రమంగా తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక వన్డేన్ సిపిఐ కార్యాలయం వద్ద మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు పోటు కళావతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మహిళా నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లతాదేవి మాట్లాడుతూ జనాభాలో సగం ఉన్న మహిళలకు ఇంకా తగిన హక్కులు, అవకాశాలు దక్కడం లేదన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉన్నప్పటికీ చట్టసభల్లో మాత్రం 33 శాతం రిజర్వేషన్లు అమలు కావడం లేదని విమర్శించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలు ముందుకు వచ్చినా లైంగిక వేధింపులు తగ్గడం లేదన్నారు. ఇటువంటి ఘటనలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు అమలు చేసేలా చట్టాలను సవరించాలని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ రంగాల్లో రాణించిన మహిళలను సన్మానించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.


