జగిత్యాల మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ దాడి
టౌన్ ప్లానింగ్ సహా పలు విభాగాల్లో తనిఖీలు
సిబ్బంది ఫోన్లు స్వాధీనం కీలక ఫైళ్ల పరిశీలన
అవినీతి ఆరోపణలపై లోతైన విచారణ
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : అవినీతి ఆరోపణల నేపథ్యంలో జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. పలు విభాగాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టి కీలక రికార్డులను పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నం ప్రారంభమైన ఈ దాడుల్లో టౌన్ ప్లానింగ్ విభాగంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్లాన్ అనుమతులు, నిబంధనల ఉల్లంఘనలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సంబంధిత ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రెవెన్యూ విభాగంలో పన్నుల వసూళ్లు, శానిటేషన్ విభాగంలో అక్రమాలపై కూడా విచారణ కొనసాగుతోంది. తనిఖీల సమయంలో కార్యాలయ గేట్లు మూసివేసి ఎవరినీ బయటకు వెళ్లనివ్వలేదు. బయట వ్యక్తులను లోపలికి అనుమతించలేదు. సిబ్బంది మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కాల్ వివరాలు, డిజిటల్ లావాదేవీలను పరిశీలిస్తున్నారు.

కీలక పత్రాలు సీజ్
విభాగాల వారీగా లావాదేవీల వివరాలను సేకరిస్తూ డాక్యుమెంటేషన్లో ఉన్న వ్యత్యాసాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. కీలక ఫైళ్లను సీజ్ చేసి మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. ఏసీబీ దాడులతో కార్యాలయంలో కలకలం నెలకొంది. సిబ్బందిలో ఆందోళన నెలకొనగా దాడులు సాయంత్రం వరకు కొనసాగనున్నట్లు సమాచారం.


