ఏసీ షార్ట్ సర్క్యూట్తో దారుణం..!
తండ్రీకూతుళ్లు సజీవ దహనం
కాజీపేటలో విషాద ఘటన కలకలం
తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రమాదం
గాఢ నిద్రలో ఉండగా మంటల్లో చిక్కుకున్న బాధితులు
కాకతీయ, హనుమకొండ : హనుమకొండ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కాజీపేట మండలం కడిపికొండలోని రాజీవ్ గృహకల్ప సముదాయంలో ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి తండ్రీకూతుళ్లు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మృతులను రాజశేఖర్ (54), ఆయన కుమార్తె రాజశ్రీ (24)గా గుర్తించారు. రాజశేఖర్ స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నట్లు సమాచారం. బుధవారం తెల్లవారుజామున సుమారు మూడు గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇంట్లో ఉన్న ఏసీ షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల మంటలు వ్యాపించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గాఢ నిద్రలో ఉన్న తండ్రీకూతుళ్లు బయటకు రావడానికి అవకాశం లేకపోయిందని తెలుస్తోంది. మంటలు వేగంగా వ్యాపించడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.
ఏసీయే కారణమా..?
పోలీసుల ప్రాథమిక అంచనాల ప్రకారం గదిలో ఉన్న ఏసీ యంత్రంలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. విద్యుత్ సంబంధిత లోపాల వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఇంట్లో మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో బయటకు తప్పించుకునే అవకాశం లేకపోయిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో కాలనీలో విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే కాజీపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నదానిపై పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేపడుతున్నారు. విద్యుత్ లోపం కారణమా, లేక ఇతర కారణాలున్నాయా అన్నదానిపై స్పష్టత రానుంది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. స్థానికులు కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.


