- రామప్పను సందర్శించిన ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఉన్నతాధికారులు
కాకతీయ, ములుగు ప్రతినిధి: వరంగల్ కాకతీయుల కళా సంపదను వీక్షంచడానికి ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఉన్నతాధికారులు బుధవారం జిల్లాకు విచ్చేశారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్లు అరవింద్ కుమార్, విశ్వజిత్ ఖన్నా దంపతులు రెండు రోజుల పర్యటనలో భాగంగా రామప్పను సందర్శించారు. ముందుగా రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని రామలింగేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామప్ప ఆలయ విశిష్టతను గైడ్ వారికి వివరించారు. అనంతరం చైర్మన్లు ఇద్దరు మాట్లాడుతూ చారిత్రక, సంస్కృతి సంప్రదాయాలు అలనాటి వైభవాన్ని కళాత్మక శిల్పాలతో కళ్లకు కట్టినట్లు నిర్మించారన్నారు.
ఈ అద్భుత కట్టడానికి యునెస్కో గౌరవం దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు. రాతిపై చెక్కిన శిల్పాల్లో జీవకళ ఉట్టిపడుతోందని, సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం, సాంకేతిక పరిజ్ఞానం ఇతిహాసాలు చరిత్ర ఇలా ఎన్నో అంశాలు ఇమిడి ఉన్నాయన్నారు. రామప్ప శిల్పకళాకృతుల సౌందర్యానికి మంత్రముగ్ధులు కావాల్సిందే అని కితాబు నిచ్చారు. రాతి స్తంభాలకు సన్నని ధారం, వెంట్రుక పట్టే రంధ్రాలు ఉండటం విశేషమని, ఆలయం అంతా చీకటిగా ఉన్నా గర్భగుడిలోని రామశింగేశ్వరుడి (శివలింగం) వద్ద వెలుతురు ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనంతరం వారు రామప్ప చెరువులో బోటులో విహరిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించారు. వారి వెంట ఎన్పీడీసీఎల్ డీఈ లు సదానందం, భాస్కర్, ఏ ఎస్ కళ్యాణ్ శేఖర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు .


