వేములవాడకు నూతన రూపు
అభివృద్ధి పనుల్లో పెరిగిన వేగం
రోడ్డు విస్తరణతో మారుతున్న పట్టణ ముఖచిత్రం
రూ.46 లక్షలతో నూతన విద్యుత్ స్తంభాలు
పనులను పరిశీలించిన విప్ ఆది శ్రీనివాస్
కాకతీయ, వేములవాడ : వేములవాడ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే దిశగా అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శనివారం పట్టణంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను పరిశీలించి, పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. బ్రిడ్జి నుండి ఆలయం వరకు సాగుతున్న విస్తరణ పనుల్లో భాగంగా సుమారు ₹46 లక్షల వ్యయంతో నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు చేపట్టారు. ఈ పనులను ప్రత్యక్షంగా పరిశీలించిన విప్, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడ ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రోడ్డు వెడల్పు పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. పట్టణ అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు.
రోడ్డు మధ్యలో ఉన్న పాత విద్యుత్ స్తంభాల స్థానంలో ఆధునిక స్తంభాలు ఏర్పాటు చేయడం వల్ల విద్యుత్ నిర్వహణ సులభమవుతుందని, అలాగే పట్టణ సుందరీకరణకు కూడా దోహదపడుతుందని చెప్పారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు.


