భూపాల్నగర్ అటవీలో పెద్దపులి సంచారం
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా మల్లంపల్లి మండలం భూపాల్నగర్ (పందికుంట) గ్రామ శివారులో పెద్దపులి సంచారం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలు కనిపించడంతో గ్రామస్థులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ములుగు ఫారెస్ట్ అధికారి డోలి శంకర్ అటవీ సిబ్బందితో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. స్మశాన వాటిక నుంచి మల్లంపల్లి వైపు పులి కదలికలు ఉన్నట్లు అడుగుజాడల ద్వారా నిర్ధారించారు. స్మశాన వాటిక వద్ద సిమెంట్ పోల్ విరిగిన ఆనవాళ్లు కూడా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువుల కాపర్లు, పొలాల్లో పనిచేసే కార్మికులు జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ శాఖ హెచ్చరించింది. పహారా చర్యలు చేపట్టి పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.


