ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు
కాకతీయ, పెద్దవంగర : పదేళ్ల పాఠశాల ప్రయాణం.. వెలకట్టలేని స్నేహాలు.. కన్నతండ్రిలా విద్యాబుద్ధులు నేర్పిన గురువులు.. ఇవన్నీ ఒక ఎత్తైతే, ఇప్పుడు ఆ గడప దాటి వెళ్తున్నామన్న బాధ మరో ఎత్తు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంతోపాటు వడ్డే కొత్తపల్లి, బొమ్మకల్ గ్రామలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగిన 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం అత్యంత భావోద్వేగాల మధ్య జరిగింది.9వ తరగతి విద్యార్థులు పదో తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఈ వీడ్కోలు సమావేశం కేవలం వేడుకగానే కాకుండా ఆత్మీయ కలయికగా మారింది. పాఠశాల ప్రాంగణంలో గడిపిన ప్రతి క్షణం విద్యార్థుల కళ్లముందు కదలాడాయి. తమను తీర్చిదిద్దిన ఉపాధ్యాయుల పాదాలకు నమస్కరిస్తూ విద్యార్థులు కృతజ్ఞతలు తెలుపుతున్నప్పుడు పలువురి కళ్లు చెమర్చాయి. ఉపాధ్యాయులు నేర్పిన పాఠాలు తమ జీవితాలకు వెలుగునిస్తాయంటూ విద్యార్థులు ఉద్వేగంగా ప్రసంగించారు.
తరగతి గదిలో సందడి, ఆటస్థలంలో కేరింతలు, భోజనాలు పంచుకున్న రోజులను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు కౌగిలించుకుని వీడ్కోలు చెప్పుకున్నారు. రేపు పాఠశాల గంట మోగితే తాము ఇక్కడ ఉండమన్న ఆలోచన వారిని కలిచివేసింది. అయితే తమ సీనియర్ల భవిష్యత్ బంగారుమయంగా ఉండాలని 9వ తరగతి విద్యార్థులు ఆకాంక్షించి వారిని సాగనంపారు. వీడ్కోలు అంటే విడిపోవడం కాదు.. కొత్త శిఖరాలను అధిరోహించేందుకు చేసే మరో ప్రయాణం అని ఉపాధ్యాయులు విద్యార్థులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముదసాని పారిజాత సురేష్, ఏఏపిసి చైర్మన్ స్వాతి,వార్డెన్, లింగన్న
ప్రధానోపాధ్యాయులు బుధరాపు శ్రీనివాస్, ఉపాధ్యాయులు రాజలింగం,సదయ్య,తఖీ పాషా, ముఖేష్, అంజన్న,శ్రీధర్, గౌరీ శంకర్, రమేష్, సత్యం, సారయ్య, ప్రభాకర్, సువర్ణ, కరుణ, హైమ పాల్గొన్నారు.


