ఆ ఇద్దరు కలెక్టర్ కన్నా పెద్దోళ్లు!
మేడమ్ చెప్పినా పెడచెవిన పెట్టిన మార్కెట్ ఉద్యోగులు
ఏనుమాముల మార్కెట్లో సూపర్వైజర్ల ఇష్టారాజ్యం
షెడ్లు లేక మొన్నటి వర్షానికి తడిసిన పత్తి బస్తాలు
వాటిని తొలగించాలని కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్
ఇదీ వ్యవసాయ మార్కెట్లో ఉద్యోగులు, అధికారుల తీరు
కాకతీయ, వరంగల్: రైతుల శ్రేయస్సు కోసం పాటుపడాల్సిన ఉద్యోగులు.. కలెక్టర్ ఆదేశాలను సైతం విస్మరించే స్థాయికి దిగజారిన వ్యవహారం ఏనుమాముల మార్కెట్లో రోజురోజుకు పెరుగుతోంది. రైతులంటే దేశానికి వెన్నెముక అంటూ ప్రభుత్వాలు, అధికారులు, లోకమంతా కీర్తిస్తుంటే.. ఇక్కడి అధికారులు, ఇతర ఉద్యోగులు మాత్రం.. తమను మించిన వారు లేరనుకున్నట్లుగా వ్యవహరిస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మార్కెట్ కు పత్తి సీజన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. రోజూ 7వేల నుంచి 10వేల వరకు పత్తి బస్తాలు మార్కెట్ కు వస్తున్నాయి. ఈ క్రమంలో మొంథా తుపాను తర్వాత మార్కెట్ కు ఒక రోజు 9వేల పత్తి బస్తాలు, ముక్కలు దండిగానే వచ్చాయి. అన్నింటినీ ఆయా యార్డుల్లోని షెడ్ల కింద రైతులచే నిల్వ చేసి విక్రయించారు. అందుకు కలెక్టర్ అధికారులను అభినందించారని తెలిసింది. అయితే, మంగళవారం అనుకోకుండా కురిసిన వర్షానికి అటు మక్కలు, ఇటు పత్తి బస్తాలు తడిసిన విషయం తెలిసిందే. ఇందుకు
షేడ్లల్లో వ్యాపారులు నిలువ చేసిన బస్తాలే కారణంగా తెలుస్తుంది.
అయితే వ్యాపారులు కొనుగోలు చేసి నిల్వ చేసిన బస్తాలను తీసి ఉంటే.. ఈ బస్తాలు తడిసేవి కావు. కానీ.. ఆ బస్తాలు అలాగే ఉండడంతో ఈ బస్తాలు తడిసాయి. ఈ వార్త మీడియాలో వైరల్గా మారింది. రైతుల సరుకుల కోసం ఏర్పాటు చేసిన షెడ్లలో వ్యాపారులు ఎలా సరుకులు నిల్వ చేస్తారని, ఇదంతా అధికారుల వైఫల్యమేనంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
మార్కెట్ ను సందర్శించిన కలెక్టర్ సత్యశారద
కాగా, గురువారం వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదాదేవి ఏనుమాముల మార్కెట్ ను సందర్శించారు. పత్తి విక్రయాల తీరును పరిశీలించారు. ఈ క్రమంలోనే షెడ్లలో బస్తాలు నిల్వ చేసినట్లు వచ్చిన వార్తలపై అధికారులను ఆరా తీశారు. వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. అయితే, పత్తి యార్డులోని 10 షెడ్లలో బస్తాలను ఖాళీ చేసిన అధికారులు.. ఓ రెండు షెడ్లలో బస్తాలను అలాగే ఉంచారు. అపరాల యార్డులో ఒక్క షెడ్ నుండి కూడ వ్యాపారులు నిలువ చేసిన మక్కల బస్తాలు ఖాళీ చేయించకపోవడం గమనార్హం. అయితే కలెక్టర్ ఆదేశించినా సదరు షెడ్ల సూపర్వైజర్లు పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అపరాల యార్డు సూపర్వైజర్ గతంలో కూడా ఇలాగే వ్యవహరించారనే ప్రచారం జరుగుతోంది.

రికార్డులను పరిశీలించిన కలెక్టర్
మార్కెట్ యార్డుల్లో కలియతిరిగిన కలెక్టర్ సత్యశారద రైతులతో నేరుగా పత్తి ధర, మార్కెట్లో కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మార్కెట్ కార్యాలయంలోకి వెళ్లారు. పలు రికార్డులను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మార్కెట్ యార్డ్ అధికారులు, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. తేమ పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయకూడదని సిసిఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) అధికారులతో చెప్పారు. పత్తి కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా కొనసాగించాలని, రైతులకు న్యాయమైన ధర లభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. వర్షాల కారణంగా తడిసిన పత్తి నాణ్యతను దృష్టిలో ఉంచుకొని రైతుల ప్రయోజనాలను కాపాడే విధంగా సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్యక్షులు రవీందర్ రెడ్డి, మార్కెట్ అంజిత్ రావు, రైతులు తదితరులు పాల్గొన్నారు.



