హన్మకొండలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ
తెలంగాణ యువతకు ఇండియన్ ఆర్మీ గుడ్ న్యూస్
ఈనెల 10 నుంచి 22 వరకు జేఎన్ఎస్లో నిర్వహణ
రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులు పాల్గొనే అవకాశం
టెక్నికల్, క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్, ట్రేడ్స్మెన్ పోస్టుల భర్తీ
టెన్త్తోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ యువతకు ఇండియన్ ఆర్మీ గుడ్న్యూస్ చెప్పింది. భారత సైన్యంలో చేరేందుకు తెలంగాణలో ‘అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ అగ్నివీర్ల నియామక ర్యాలీ ఈనెల 10 నుంచి 22 వరకు హన్మకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరగనుందని ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. చెన్నై జోన్ రిక్రూటింగ్ ఆఫీస్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ సమన్వయం, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఈ ర్యాలీ చేపట్టనున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్లో పాల్గొనే అవకాశం కల్పించారు.
పారదర్శకంగా నియామక ప్రక్రియ
అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్, ట్రేడ్స్మెన్ తదితర పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. దీనికి పదో తరగతి అర్హత ఉండాలని సూచించారు. అభ్యర్థులు తమకు జారీ చేసిన అడ్మిట్ కార్డుతో పాటు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను తీసుకురావాలని బోర్డు సూచించింది. సంబంధిత నోటిఫికేషన్ ఇప్పటికే మార్చి 12 విడుదలై www.joinindianarmy.nic.in వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు బోర్డు తెలిపింది. నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని బోర్డు అధికారులు తెలిపారు. నియామక సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం నంబర్లు 040-27740059, 27740205లలో సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.



