- పెండింగ్ సీఎంఆర్ రైస్ డెలివరీని 8లోగా పూర్తి చేయాలి
- కలెక్టర్ కోయ శ్రీ హర్ష
కాకతీయ, పెద్దపల్లి : 2024–25 ఖరీఫ్ సీజన్కు సంబంధించిన పెండింగ్ సీఎంఆర్ రైస్ డెలివరీని నవంబర్ 8లోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్, అదనపు కలెక్టర్ డి.వేణుతో కలిసి అధికారులు, రైస్ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఖరీఫ్ 2024 సీజన్లో జిల్లాలో 99.5 శాతం సీఎంఆర్ రైస్ డెలివరీ పూర్తి చేసి, రాష్ట్రంలోనే పెద్దపల్లి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. జిల్లాలోని 11 రైస్ మిల్లుల పరిధిలో ఇంకా 29 ఏసీకే రైస్ సరఫరా పెండింగ్లో ఉందని, దానిని గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో ధాన్యం కేటాయింపునకు బ్యాంకు గ్యారంటీ సమర్పించడం తప్పనిసరి అని అన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీనాథ్, మేనేజర్ శ్రీకాంత్, రైస్ మిల్లర్లు, అధికారులు పాల్గొన్నారు.


