రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి
మృతుల సంఖ్య పెరిగే అవకాశం.. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది
కాకతీయ,రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టింది. ఈ సంఘటన ఆదివారం ఉదయం చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగింది. బస్సుపై కంకర లోడు పడిపోవడంతో 20 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది.ఆదివారం సెలవు కావడంతో ఇళ్లకు వెళ్లి తిరిగి నగరానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్-బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్జామ్ అయింది. చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని జేసీబీ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు.


