విద్యార్థినులకు పౌష్టికాహారం అందించాలి
వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదివారం సంగెం మండలంలోని గవిచర్లలోని తెలంగాణ బాలికల మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూం లను పరిశీలించి సదుపాయాలను గమనించారు. బియ్యం నిల్వలు, కూరగాయల నాణ్యత, సరుకుల స్టాక్ ను పరిశీలించారు. తాజా కూరగాయలు వినియోగించాలని, ఈగలు, దోమల బెడద లేకుండా పాఠశాల సముదాయాన్ని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పరిసరాల్లో గల ముళ్ల పొదలను తొలగించాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మెనూ పట్టికను పరిశీలించి, విద్యార్థినులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలన్నారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే ఏర్పాటుచేసిన ఫిర్యాదుల పెట్టెలో వేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా రెసిడెన్షియల్ పాఠశాలలో కావలసిన సదుపాయాల గురించి విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగ వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీబీసీడీవో పుష్పలత, తహసీల్దార్ రాజ్ కుమార్, వార్డెన్, తదితరులు ఉన్నారు.


