కరీంనగర్ టవర్ సర్కిల్లో అగ్ని ప్రమాదం.
అగ్నిమాపక సిబ్బంది గంటలపాటు శ్రమ అదుపులోకి మంటలు.
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని ప్రధాన వ్యాపార ప్రాంతమైన టవర్ సర్కిల్లో బుధవారం ఉదయం భయానక అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టవర్ సర్కిల్ రోడ్డుపై ఉన్న ‘కపిల్ డ్రెస్సెస్’ దుస్తుల షాపులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. షాపులో ఉన్న వస్త్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకోవడంతో ఆ ప్రాంతంలో ఆందోళన నెలకొంది. కొద్ది సేపట్లోనే మంటలు పక్కనే ఉన్న ఫోటో స్టూడియో వెడ్డింగ్ డెకరేషన్ సామగ్రి షాపులకు కూడా వ్యాపించాయి.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని రెండు ఫైరింజిన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. మంటలు ఎగసిపడుతున్న సమయంలో దట్టమైన పొగ కారణంగా పరిసర వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.ఈ ఘటనలో లక్షల రూపాయల విలువైన వస్త్రాలు, ఫొటో సామగ్రి, వెడ్డింగ్ డెకర్ మెటీరియల్ దగ్ధమైనట్లు ప్రాథమిక సమాచారం. అయితే ప్రాణనష్టం జరగలేదని స్థానికులు పేర్కొన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణం షార్ట్ సర్క్యూట్ అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.ప్రమాదం జరిగిన ప్రాంతంలో పోలీసులు మోహరించి రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



