- జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు
- పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్న మహిళలు
- పాల, నాగబంధం కావడలు సమర్పించిన స్వాములు
కాకతీయ, గీసుగొండ : నాగుల చవితి వేడుకలు నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా నిర్వహించారు. నాగుల చవితి పండుగను పురస్కరించుకొని మండలంలోని ప్రసిద్ధిగాంచిన ఊకల్ శ్రీవల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారికి విశేష అభిషేకము, పూజలు నిర్వహించి, గజమాల బంతిపూలతో ప్రత్యేకంగా అలంకరించారు. మండల దీక్షలు చేపట్టిన స్వాములు పంచామృత కావడులతో మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా వచ్చి స్వామివారికి కావడం సమర్పించారు. స్వాములు సమర్పించిన పంచామృతా లతో నాగసుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకించారు. అనంతరం స్వాములు నాగబంధ కావడులను మోకాళ్ళ మీద నడుచుకుంటూ వచ్చి స్వామివారికి సమర్పించి మాల విరమణ చేశారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శన ఆచార్యులు మాట్లాడుతూ నాగుల చవితి పర్వదినాన స్వామి వారిని దర్శించుకుని పుట్టలో పాలు పోసినచో కాలసర్ప దోషాలు కుజ రాహు కేతు శని గ్రహాల దోషాలు తొలగి, కల్యాణ, సంతాన, ఉద్యోగ, విదేశీ గమన ప్రాప్తి కలుగుతాయన్నారు. రైతులు పూజించినచో పాడిపంటలు సమృద్ధిగా పండుతాయని తెలిపారు. కాగా, గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ తన జన్మదినం సందర్భంగా కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఎంపీవో పాక శ్రీనివాస్, ఏపీడీ శ్రీవాణి, ఊకల్ జీపీవో కళ్యాణి రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు శ్రీధర్, ప్రశాంత్, స్వప్న, సునీత, ప్రవీణ, ఈసీ శ్రీలత, టీఎలు సుష్మ,సింగ్, స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగుల చవితి సందర్భంగా జిల్లా నలుమూల ల నుంచి భక్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారికి మొక్కులు చెల్లించు కున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉప అర్చకులు శ్రీ హర్ష, ఆలయ కమిటీ చైర్మన్ తిమ్మాపురం రాజేశ్వరరావు, కోశాధికారి కొత్తగట్టు రాజేందర్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


