డీసీపీపై కత్తితో దాడికి యత్నం
సెల్ఫోన్ దొంగలను అడ్డుకునేందుకు యత్నం
తోపులాటలో కిందపడిపోయిన గన్మెన్
ఆయన వెపన్తో దొంగలపై డీసీపీ చైతన్య కాల్పులు
ఇద్దరిలో ఒకరికి తీవ్రగాయాలు.. దవాఖానకు తరలిపు
చాదర్ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ వద్ద ఘటన
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీస్ ఉన్నతాధికారులు
కాకతీయ, హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలో మొన్న ప్రమోద్ అనే పోలీసు కానిస్టేబుల్ను హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్ నగరంలో ఇలాంటి షాకింగ్ ఘటన వెలుగుచూసింది. సెల్ ఫోన్ దొంగను పట్టుకునే యత్నంలో సౌత్ఈస్ట్ డీసీపీ చైతన్యపై దాడికి యత్నం జరిగింది. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నింగా.. దొంగలు వారిపైనే తిరగబడ్డారు. ఈక్రమంలో డీసీపీ చైతన్య గన్మెన్ దగ్గరున్నతుపాకీతో వారిపై కాల్పులు జరపడం కలకలంరేపింది..
అసలేం జరిగింది ?
హైదరాబాద్ సీపీ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ హాజరయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం చైతన్య తిరిగి తన కార్యాలయానికి వస్తున్నారు. చాదర్ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ వద్దకు రాగానే ఓ ఇద్దరు దొంగలు సెల్ఫోన్లను చోరీ చేసి పారిపోతున్నారు. ఆ సెల్ఫోన్ స్నాచర్స్ను గమనించిన డీసీపీ చైతన్య తన గన్మెన్ను అప్రమత్తం చేశారు. డీసీపీ, గన్మెన్ కలిసి ఆ ఇద్దరు దొంగలను పట్టుకునేందుకు యత్నించారు. ఈక్రమంలో దొంగలు.. డీసీపీపై కత్తితో దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. దొంగలను గన్మెన్ అడ్డుకునేందుకు యత్నించాడు. కానీ తోపులాటలో గన్మెన్ కింద పడిపోయాడు. దీంతో అప్రమత్తమైన డీసీపీ చైతన్య.. గన్మెన్ వద్ద ఉన్న వెపన్ను తీసుకుని దొంగలపై కాల్పులు జరిపాడు. ఇద్దరిలో ఒక దొంగకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని నాంపల్లి కేర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.
ఘటనాస్థలిని పరిశీలించిన ఉన్నతాధికారులు
కాల్పులు చోటు చేసుకున్న విక్టోరియా గ్రౌండ్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఘటనాస్థలిని సౌత్, సెంట్రల్ జోన్ డీసీపీలు స్నేహామెహ్రా, శిల్పావళితో పాటు పలువురు సీఐలు, ఎస్సైలు పరిశీలించారు. డీసీపీతో పాటు గన్మెన్కు ఎలాంటి గాయాలు కాలేదని, సురక్షితంగా ఉన్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.


