ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
ఖానాపూర్ కేజీబీవీను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
కాకతీయ, నర్సంపేట: విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద అన్నారు. శుక్రవారం ఖానాపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కిచెన్, వంట గది, స్టోర్ రూమ్, భోజనానికి వినియోగించే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. భోజన నాణ్యతను పరిశీలించి, కూరల రుచిని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనును ఖచ్చితంగా పాటించాలన్నారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరుపై ఆరా తీశారు. కేజీబీవీలో విద్యార్థుల సౌకర్యార్థం కనీస వసతులు కల్పించడంలో భాగంగా ఏర్పాటు చేసిన తలుపులు, ఇనుప గ్రిల్స్, టాయిలెట్ల మనమ్మత్తులను, ఆరో ప్లాంట్, కిచెన్ రూఫ్ తదితర పూర్తయిన పనులను కలెక్టర్ పరిశీలించారు. కోతులు వస్తున్నాయని ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా కోతులు రాకుండా వెంటనే మెష్ ఏర్పాటు చేయాలని డీఈ ను ఆదేశించారు. వారంలో ఒకరోజు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ డేగా నిర్ణయించి ఆరోజు పిల్లలతో అదే భాష రోజు మొత్తం మాట్లాడించాలని, దీని ద్వారా వకాబులరీ పెరుగుతుందన్నారు . విద్యార్థులతో ముచ్చటించి, సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే ఏర్పాటు చేసిన కంప్లైంట్ బాక్స్ లో వేయాలన్నారు. క్రీడల కొరకు వాలీబాల్ బాస్కెట్బాల్, ఖో ఖో కోర్టులు కావాలని విద్యార్థులు కలెక్టర్ ను కోరగా, తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో తహసిల్దార్ రమేష్, టిఈడబ్ల్యూఐడిసి, డిఈ అశోక్, జిఈసిఓ ఫ్లోరెన్స్, ఎంఈఓ శ్రీదేవి స్పెషల్ ఆఫీసర్ మేనక, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



