- సామన్యుడి సంక్షేమం, అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యం
- రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం బీసీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాల్గొని లబ్ధిదారు బయ్యా ప్రమీల ఇంటి తాళాలు అందజేసి గృహప్రవేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పేదల కలల్ని సాకారం చేయడమే తమప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా సొంతింటి కలను సాకారం చేయడమే అందుకు నిదర్శనమన్నారు. అర్హులైన ప్రతి పేదవారికి విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల బాగోగులకు ప్రతీకగా నిలిచిందని, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎల్లప్పుడూ సామాన్యుల సంక్షేమానికే కట్టుబడి ఉంటాయని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు అంటేనే కాంగ్రెస్ గుర్తుకు వస్తుంది అని, పేద ప్రజల కలల ఇళ్ల రూపంలో ఈ పథకం దోహదపడింది అని పేర్కొన్నారు. రైతులు, కూలీల సంక్షేమం కోసం ప్రభుత్వం శ్రద్ధగా పనిచేస్తోందని ఆమె అన్నారు. రైతును రాజుగా చూడాలనే సంకల్పంతోనే సన్నవరి వడ్లకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తున్నాం అని తెలిపారు. తొమ్మిది నెలల్లోనే రూ.21 వేల కోట్లతో రెండు లక్షల లోపు ఉన్న రైతుల రుణ మాఫీ పూర్తి చేశారు అన్నారు. రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు.
మూడు విడతల్లో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇండ్లు కట్టించేందుకు చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ, 17 లక్షల పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల పేర్లు నమోదు చేశామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కేవలం కమీషన్ల కోసం మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టుపై దృష్టి పెట్టిందని ఆమె విమర్శించారు. పేదల గౌరవప్రదమైన జీవనానికి ప్రతీకగా నిలిచే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండూ కాంగ్రెస్ ప్రభుత్వంలో సమపాళ్లలో ముందుకు సాగుతున్నాయని మంత్రి సీతక్క తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లాడి రామ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


