- సన్న బియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే
- త్వరలోనే వరంగల్ కలెక్టరేట్ ప్రారంభం
- దేవాదాయ శాఖమంత్రి కొండా సురేఖ
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి కొండా సురేఖ అన్నారు. మంగళవారం వరంగల్ శివనగర్ లోని సాయి కన్వెన్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ , సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఋ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొండా సురేఖ పాల్గొని పేదలకు చెక్కులు అందజేశారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నాలుగు వేలకు పైగా లబ్ధిదారులకు ఐదు కోట్ల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశామన్నారు.
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాల, అందుకోసం 200 కోట్ల నిధులను సైతం కేటాయించామన్నారు. త్వరలోనే ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు భూమి పూజ చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందించామన్నారు. త్వరలోనే వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేస్తామని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తోందన్నారు. అలాగే అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు.
42శాతం బీసీ రిజర్వేషన్ కు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బీజేపీ, బీఆర్ ఎస్ రెండు పార్టీలు కలిసి స్థానిక ఎన్నికలను అడ్డుకున్నాయని మంత్రి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మంత్రి దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సోమిశెట్టి ప్రవీణ్, ఉమా యాదవ్ , పోశాల పద్మ, చింతాకుల అనిల్, భోగి సువర్ణ, కావేటి కవిత, పల్లం పద్మ, డిఆర్ ఓ విజయలక్ష్మి, ఉప కమిషనర్ ప్రసన్నారాణి, తహసీల్దార్లు శ్రీకాంత్, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.


