- వీలైనంత వర్క్ ఫోర్స్ పెట్టండి, మిషనరీని తీసుకురండి
- రాజధాని నిర్మాణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ప్రతిఫ్లోరును పరిశీలించిన సీఎం
అమరావతి, అక్టోబర్ : రాజధాని నిర్మాణాల పూర్తికి సమయాన్ని నిర్ధేశించుకుని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సీఆర్డీఏ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు ప్రతి ఫ్లోర్ను పరిశీలించారు. ఏ అంతస్తుల్లో ఏయే కార్యాలయాలు ఏర్పాటు చేశారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత సీఆర్డీఏ భవనంలో రాజధాని నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి సమీక్షించారు. పనులు ప్రారంభించిన చోట నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై సీఎం ఆరా తీశారు. పనులకు ఎలాంటి ఇబ్బంది కలగని విధంగా నిర్మాణాల వద్ద మౌలిక సదుపాయాలను కల్పించామని అధికారులు తెలిపారు. ‘‘ప్రస్తుతం వర్షాల కారణంగా నిర్మాణ పనులకు ఏమైనా ఇబ్బందులు వచ్చినా.. వర్షాకాలం పూర్తి అయిన తర్వాత పూర్తిస్థాయిలో పనులు పరుగులు పెట్టించాలి. ఆర్థిక పరమైన ఇబ్బందులు లేవు, ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ఆర్థిక శాఖకు కూడా చెబుతాను.” ఈ సమీక్షలో కేంద్ర మంత్రి పెమ్మసాని, మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, ధూళిపాళ నరేంద్ర, కొలికపూడి శ్రీనివాస్, మున్సిపల్ శాఖ, సీఆర్డీఏ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


