కాకతీయ, దుగ్గొండి: ఇటీవల గుండెపోటుతో మరణించిన దుగ్గొండి మాజీ ఎంపీటీసీ జిల్లెల్ల సాయి కుమార్ దశ దినకర్మ సోమవారం దేశాయిపల్లిలో జరిగింది. ఈ సందర్భంగా బాధిత కుటుంబాన్ని వరంగల్ జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ పరామర్శించి యాభై వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. తమతో కలిసి ఉండే వ్యక్తి ఆకస్మాతుగా మరణించడంతో పెద్ద దిక్కును కోల్పోయిన బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. అదేవిధంగా మాజీ ఎంపీటీసీగా చేసిన సేవలను గుర్తుంచుకొని మానవతా దృక్పథంతో పార్టీలకు అతీతంగా శంబయ్యపల్లి గ్రామస్తులు స్వచ్ఛందంగా ముప్పై ఒకవెయ్యి ఆరువందల రూపాయలను సేకరించి సాయి కుమార్ కుటుంబ సభ్యులకు అందజేశారు. వీరితో పాటుగా బీఆర్ఎస్ జిల్లా నాయకులు వంగేటి అశోక్ కుమార్, పెండ్యాల రాజు ఇరువురు కలసి ముప్పై ఐదు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించినట్లు తెలిపారు.


