- ప్రతి ఇంటికీ.. పల్లెకూ కాషాయ జెండా తీసుకెళ్తాం..
- కార్యకర్యలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా..
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తన ప్రయాణం ప్రజా సేవ కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ సందర్భంగా తనను ఆశీర్వదించిన ప్రతిఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీకి కార్యకర్తలే పునాది. భుజాలు కాయలుకాసేలా జెండాలు మోసి పార్టీని అధికారపీఠంవైపు తీసుకుపోయేందుకు కార్యకర్తలు చేస్తున్న కృషి నాకు తెలుసు. కార్యకర్తల కఠోరశ్రమలో నేను భాగమే. ఒక కార్యకర్తగా పార్టీలో ప్రయాణం ప్రారంభించి, అందరి ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా మీ ముందున్నాన. నేను అధ్యక్షుడు అయ్యి వంద రోజులైంది. ఈ వందరోజుల్లో అత్యధిక భాగం కార్యకర్తలతో మమేకం అయ్యేందుకే కృషి చేశా… అన్నారు.
పార్టీ అంటే ప్రాణం..
రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత కార్యకర్తలను కలిసేందుకు అనేక జిల్లాల్లో పర్యటనలు జరిపాను. ప్రజా ఉద్యమాలకు ఊతమిచ్చాను. పార్టీకి గుండెకాయలాంటి కార్యకర్తలను నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. వంద రోజుల్లో అనేక పోరాటాల్లో పార్టీని భాగం చేస్తూ స్వయంగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను. పార్టీ అంటే నా ప్రాణం, కార్యకర్తలే పార్టీకి ప్రాణం. అలాంటి కార్యకర్తల కోసం మనసా వాచా కర్మణా ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తాను… అన్నారు.
మరింత బలంగా..
ఈ 100 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ, ప్రతి జిల్లాలో ప్రజలతో మమేకమై, కార్యకర్తల ఉత్సాహాన్ని, ప్రజల ఆశలను బీజేపీ దిశగా మలిచే ప్రయత్నం చేశాను. మన పార్టీ సిద్ధాంతం – “సేవే లక్ష్యం” అనే మంత్రంతో రైతుల సమస్యల నుంచి బీసీ రిజర్వేషన్ల దాకా, మహిళలు, యువత, మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేశాను. రానున్న రోజుల్లో మరింత బలంగా, మరింత ప్రజా ఆధారంగా ప్రతి పల్లె, ప్రతి కుటుంబంలోకి తీసుకెళ్లడం నా ప్రధాన సంకల్పం. మన లక్ష్యం — ప్రజల హక్కు కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే మనందరి లక్ష్యం. .. అని
రాంచందర్రావు అన్నారు.


