- ఐటీ, ఫార్మా హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం..
- విద్యార్థుల పరిశోధనలు సమాజానికి ఉపయోగపడాలి
- మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు
- నాంపల్లిలో ఘనంగా కేయూ ఫార్మా అల్యూమిని గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఐటీ, ఫార్మా హబ్గా తెలంగాణను తీర్చిదిద్దుతామని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఓఆర్ఆర్ నిర్మించాం… శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించాం.. ఈ రెండూ హైదరాబాద్కు అనేక పరిశ్రమలు వచ్చేందుకు కీలక భూమిక పోషించాయని అన్నారు. ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించబోతున్నామన్ని అన్నారు. ఓఆర్ఆర్ నుంచి ట్రిబుల్ ఆర్కు ఏర్పాటుచేస్తున్న రేడియల్ రోడ్లు పారిశ్రామిక వృద్ధికి దోహద పడుతాయన్నారు. తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు మంత్రివర్గం అంతా కలిసి అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని వివరించారు.
మీ సేవలు వెలకట్టలేనివి
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో కాకతీయ యూనివర్సిటీ ఫార్మా అల్యూమిని (1974-2025) గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథులుగా మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరై మాట్లాడారు. కాకతీయ యూనివర్సిటీ ఫార్మా అల్యూమ్ని గోల్డెన్ జూబ్లీ వేడుకలకు హాజరుకావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఫార్మసీ వృత్తి .. సమాజం పట్ల హ్యుమానిటీకి, పరిశోధన, చికిత్స, నూతన ఆవిష్కరణలకు మధ్య వారధిగా పని చేస్తుందన్నారు. ప్రజల ఆరోగ్యం, భద్రత, వారి దీర్ఘాయుష్షు కోసం మీరు అందించే సేవలు వెలకట్టలేనివని, సమాజం కోసం మీ మేధస్సును దారపోస్తారన్నారు. ఫార్మా రంగం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని అన్నారు.
భవిష్యత్ ఆవిష్కరణలకు వారధి..
నల్గొండ జిల్లా సంకిశాల ప్రాంతానికి చెందిన పైళ్ల మల్లారెడ్డి 35 ఏళ్లుగా ఫార్మా రంగంలో ఉన్నారు. ఆయన న్యూ యార్క్ లో బ్యాక్టోలాక్ ఫార్మాస్యూటికల్, పలు కంపెనీలకు చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఆయన మార్కెట్ నెట్ వర్త్ సుమారు 10 వేల కోట్లు.. గ్రామీణ ప్రాంతానికి చెందిన పైళ్ల మల్లారెడ్డి లాంటి వారిని నేటి ఫార్మా విద్యార్థులు స్పూర్తిగా తీసుకోవాలి. విద్య అనేది మనలో వెలుగు నింపుతుంది, తరతరాలకు ప్రేరణ ఇస్తుంది. ఇట్లాంటి సంస్థలు తెలంగాణ నే కాదు యావత్ భారతదేశాన్ని అభివృద్ధిలో, నూతన ఆవిష్కరణలో,సమాజ సేవ మార్గంలో నంబర్ వన్ గా నిలిపే మూల స్తంభాలుగా ఉంటాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అన్నారు. గత అయిదు దశాబ్దాలుగా యూసిపిఎస్సి ఔషధ విద్య, పరిశోధన సామాజిక సేవల్లో అగ్రగామిగా నిలిచిందన్నారు. విద్యార్థుల్లో మేధస్సుతో పాటు నైతిక విలువలను పెంపొందించడం ద్వారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అకాడమిక్, ఇండస్ట్రీ, నియంత్రణ సంస్థలలో నాయకులుగా ఎదిగేలా చేసిందన్నారు. ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ గత విజయాల జ్ఞాపకాన్ని మాత్రమే కాకుండా, భవిష్యత్ ఆవిష్కరణలకు, సహకారానికి ప్రేరణగా నిలవాలని మంత్రులు ఆకాంక్షించారు.


