- రాజకీయ స్వలాభానికే బీసీల హక్కులు పణం
- చిత్తశుద్ధి ఉంటే వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి
- బిల్లు పెండింగ్లో ఉండగా నోటిఫికేషన్ జారీ చేయడం చట్టవిరుద్ధం
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కల్పన జీవోపై హైకోర్టు స్టే విధించడానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
అన్నారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9పై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో బీసీ రిజర్వేషన్లపై స్టే విధించడంపై కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని రాంచందర్ రావు అన్నారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన,.. చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించిన కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈరోజు ఓబీసీలు ఎదుర్కొంటున్న దురవస్థకు కారణమని తెలిపారు. బీసీలకు న్యాయం జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లి, న్యాయపరమైన లొసుగులను సరిచేసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని ఆయన తెలిపారు.
నోటిఫికేషన్ జారీ చేయడం చట్టవిరుద్ధం..
ఆగస్టు 31న అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్కు పంపినప్పటికీ, గవర్నర్ నిర్ణయం తీసుకోవడానికి ఉన్న మూడు నెలల గడువు ముగియకముందే ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిందని రాంచందర్రావు విమర్శించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం గవర్నర్కు పంపిన బిల్లులపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఆ గడువు పూర్తికాకముందే ప్రభుత్వం తొందరపడి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసమే వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి చట్టపరమైన లొసుగులను సరిదిద్దుకోవాలని ఆయన సూచించారు. ప్రతీ అంశాన్ని రాజకీయ కోణంలో మాత్రమే చూసి, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వర్గాల ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని రాంచందర్ రావు గారు తెలిపారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు “బిజెపి అడ్డుకుంటోంది” అనే దుష్ప్రచారం చేస్తున్నారని, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చట్టపరమైన అవగాహన లేదా ఆలోచనల స్పష్టత లేదని విమర్శించారు.
బీసీ రిజర్వేషన్ల కల్పనకు బీజేపీ మద్దతు
భారతీయ జనతా పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు పూర్తిగా మద్దతు ఇస్తూ దానికి కట్టుబడి ఉందని రాంచందర్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లి బీసీ రిజర్వేషన్లపై చట్టపరమైన సవరణలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బిల్లులు తెచ్చి, డిక్లరేషన్లు, ఆర్డినెన్స్ సవరణలు.. ఇలా న్యాయపరంగా చెల్లుబాటు కాని విధానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి లేని, చట్టపరంగా తప్పుడు నిర్ణయాలతో బీసీల హక్కులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుందని మండిపడ్డారు. హైకోర్టులో వచ్చిన ఈ ఫలితానికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలన్నారు. బీసీలకు న్యాయం జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని ఆయన తెలిపారు. మధ్యప్రదేశ్లో 57 శాతం రిజర్వేషన్లకు బిజెపి ప్రభుత్వం సుప్రీంకోర్టులో పోరాడుతోందని, కాబట్టి బీజేపీ రిజర్వేషన్లకు మద్దతుగా నిలుస్తోందని వివరించారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కేవలం ఓట్ల కోసం, రాజకీయ స్వలాభం కోసం బీసీలకు అన్యాయం చేస్తోందని రాంచందర్ రావు తీవ్రంగా విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలే లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల, వారి సాధికారత పట్ల నిజమైన చిత్తశుద్ధి లేదని అన్నారు. అసలు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు వేసినవారే కాంగ్రెస్ పార్టీకి చెందినవారని రాంచందర్ రావు ఆరోపించారు.


