సకాలంలో భూ సమస్యలు పరిష్కరించేలా చొరవ చూపాలి
– సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
– డివిజన్ లోని తహసీల్దార్లకు కలెక్టర్ నిర్దేశం
కాకతీయ, నర్సంపేట: సకాలంలో భూ సమస్యలు పరిష్కరించేలా చొరవ చూపాలని, నర్సంపేట రెవెన్యూ డివిజన్ లోని తహసీల్దార్లకు కలెక్టర్ సూచించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి కార్యక్రమం ద్వారా రైతులు సకాలంలో తమ భూ సంబంధిత సమస్యలను పరిష్కరించుకునేలా చొరవ చూపాలని, దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా వెంటనే ఆర్జీలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. బుధవారం కలెక్టర్ డాక్టర్ సత్య శారద అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలసి నర్సంపేట ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రెవిన్యూ డివిజన్లోని 6 మండలాల తహసిల్దార్, ఇతర సిబ్బందితో భూభారతి అమలుపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించరని, ఎన్ని అర్జీలు పెండింగ్ లో ఉన్నాయని, ఎంత మందికి నోటీసులు ఇచ్చారని, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయ్యిందా లేదా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.
క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన అర్జీలు నిర్ణీత గడువు లోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్టయితే అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. సాదా బైనామా, పీఓటీ లకు సంబంధించిన అప్లికేషన్ లను క్షుణ్ణంగా పరిశీలించాలని వెంటనే నోటీసులు జారీ చేస్తూ ప్రాధమిక వెరిఫికేషన్ నిర్వహించాలన్నారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఆర్జీల పరిష్కారంలో జాప్యం జరుగకుండా రోజువారీగా దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ, వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమీక్షా సమావేశంలో నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి,
నర్సంపేట తహసీల్దార్ రవిచంద్ర రెడ్డి, దుగ్గొండి తహసీల్దార్ రాజేశ్వరరావు, తహసీల్దార్లు రాజ్ కుమార్, అబిడ్ అలీ, రమేష్, కృష్ణా, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


