- జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కాకతీయ, కరీంనగర్ : మహిళా ఆటో డ్రైవర్లు ఆర్థిక సాధికారత సాధించి తోటి మహిళలకు ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా, శిశు వికాస కేంద్రంలో ఎలక్ట్రిక్ ఆటో డ్రైవింగ్ లో శిక్షణ పొంది ఉపాధి పొందుతున్న మహిళలతో పమేలా సత్పతి కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు విభిన్న రంగాలలో రాణించాలని, స్వయం ఉపాధి పొందుతూ ఆర్థిక సాధికారత సాధించాలన్న ఉద్దేశంతో ఆటో డ్రైవింగ్ లో ఉచిత శిక్షణ ఇవ్వడం జరిగిందని, అంతేకాకుండా వారికి ఉచితంగా ఆటోలు అందజేశామని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళా ఆటో డ్రైవర్లు ఉపాధి పొందాలని తెలిపారు. ఆటోలను కుటుంబ సభ్యులకు, ఇతరులు ఎవరికీ ఇవ్వరాదని అన్నారు. ఆటోలు కేటాయించిన మహిళలే నడుపుతూ తోటి మహిళలకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ సమావేశంలో మహిళా ప్రాంగణం మేనేజర్ సుధారాణి, తదితరులు పాల్గొన్నారు.


