- కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్తో రైతుల అనుసంధానం
- సాగు వ్యయం, రసాయనాల వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యం
- జర్మనీ పరిశోధన సంస్థ ‘ఫ్రాన్హోఫర్ హెచ్హెచ్ఐ’ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ
కాకతీయ, తెలంగాణ బ్యూరో : డిజిటల్ వ్యవసాయంలో తెలంగాణను అగ్రగామిగా నిలపాలన్నదే సంకల్పమని, ఆ దిశగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పెట్టుబడి వ్యయం, రసాయనాల వినియోగాన్ని తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే సంకల్పమని వివరించారు. సాగులో నూతన ఆలోచనలతో ముందుకొచ్చే ఆవిష్కర్తలను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామన్నారు. కృత్రిమ మేథ(ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) లాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ను రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులకు ఎలా అనుసంధానం చేయాలనే అంశంపై మంగళవారం సచివాలయంలో జర్మనీకి చెందిన ప్రముఖ పరిశోధన సంస్థ ‘ఫ్రాన్హోఫర్ హెచ్హెచ్ఐ’ ప్రతినిధుల బృందంతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
సుమారు 55 శాతం మందికి జీవనోపాధి ..
‘తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంది. రాష్ట్ర జనాభాలో సుమారు 55 శాతం మందికి జీవనోపాధి కల్పిస్తోంది. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి పెరుగుదలకు తన చేయూతను అందిస్తోంది. మరోవైపు కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ కు రాష్ట్రం గ్లోబల్ హబ్ గా మారింది. ఇలాంటి తరుణంలో డిజిటల్ వ్యవసాయంలో తెలంగాణను ఆదర్శంగా నిలపాలని సంకల్పించాం’ అని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. ‘రోజురోజుకూ వ్యవసాయంలో పెట్టుబడి వ్యయం పెరుగుతోంది. పైగా… సాగులో పురుగు మందుల వినియోగం పెరిగి పర్యావరణానికి ఎంతో హానీ జరుగుతోందని అన్నారు.
కొనుగోలు ఖర్చు, శ్రమ గణనీయంగా తగ్గుతుంది
‘అత్యాధునిక సెన్సార్ల ద్వారా నేల స్వభావాన్ని రైతులు ముందే తెలుసుకోవచ్చు. ముందస్తు హెచ్చరిక వ్యవస్థల ద్వారా పురుగు మందుల వినియోగాన్ని తగ్గించొచ్చు. ఫలితంగా రసాయనాల కొనుగోలు ఖర్చు, శ్రమ గణనీయంగా తగ్గుతుంది. రైతులపై పడే ఆర్థిక భారం తగ్గుతుంది. పర్యావరణానికి మేలు జరుగుతుంది. సుస్థిరమైన, క్లైమేట్-రెసిలియెంట్ వ్యవసాయ పద్ధతులకు మార్గం సుగమం అవుతుంది’ అని చెప్పారు. అనంతరం… రాష్ట్రంలో గత రెండేళ్లుగా వేములవాడ కు సమీపంలోని మూడు గ్రామాల్లో ‘ఫ్రాన్హోఫర్ హెచ్హెచ్ఐ’ ఆధ్వర్యంలో అమలవుతున్న ‘యాక్సిలరేటింగ్ క్లైమేట్-రెసిలియెంట్ అగ్రికల్చర్ ఇన్ తెలంగాణ’ ప్రాజెక్టు పురోగతిని సమీక్షించారు.


