కాకతీయ, బిజినెస్ డెస్క్: మనలో ప్రతి ఒక్కరికి స్వంత ఇల్లు ఉండాలనే కల ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ కలను నిజం చేసుకోవడం అంత సులభం కాదు. ఇళ్ల ధరలు విపరీతంగా పెరగడంతో మధ్యతరగతి ప్రజలు, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు స్వంత గృహం కలను సాకారం చేసుకోవడం చాలా కష్టమైపోయింది. ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) పథకం అనేక కుటుంబాలకు ఆశాకిరణంగా మారింది.
ఈ పథకంలో ప్రధాన ఆకర్షణ Interest Subsidy Scheme (ISS). ఈ పథకం కింద గృహ రుణాలపై గరిష్టంగా 4శాతం వరకు వడ్డీ సబ్సిడీ లభిస్తుంది. ఉదాహరణకు, ఒక కుటుంబం రూ.8 లక్షల వరకు హోమ్ లోన్ తీసుకుంటే, దాదాపు రూ.1.80 లక్షల వరకు ప్రభుత్వం సబ్సిడీగా చెల్లిస్తుంది. ఈ మొత్తం నేరుగా రుణ ప్రిన్సిపల్ నుంచి తగ్గిస్తుంది. దాంతో EMIలు గణనీయంగా తగ్గుతాయి. ఈ విధంగా కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారం తగ్గిపోతుంది, గృహం కలను సులభంగా నిజం చేసుకునే అవకాశం కలుగుతుంది.
ఈ పథకాన్ని ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాల కోసం రూపొందించారు. వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉన్నవారు EWS (Economically Weaker Section) కేటగిరీకి, రూ.6 లక్షల లోపు ఉన్నవారు LIG (Lower Income Group) కేటగిరీకి, రూ.9 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు MIG (Middle Income Group) కేటగిరీకి చెందుతారు. ఈ వర్గాలకు చెందినవారే వడ్డీ సబ్సిడీ పొందగలరు. అయితే, ఒక ప్రధాన అర్హత ఏమిటంటే. లబ్ధిదారుడు దేశంలో ఎక్కడా స్వంత ఇల్లు కలిగి ఉండకూడదు.
PMAY పథకం మొత్తం నాలుగు విభాగాలుగా ఉంది. Beneficiary-Led Construction (BLC), Affordable Housing in Partnership (AHP), Affordable Rental Housing (ARH), Interest Subsidy Scheme (ISS). వీటిలో ISS అత్యంత ప్రజాదరణ పొందింది. ఎందుకంటే ఇది నేరుగా EMI తగ్గింపుని ఇస్తుంది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తం నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. ఇది ఐదు విడతలుగా విడుదల అవుతుంది. ఈ మొత్తం లోన్ ప్రిన్సిపల్ నుంచి తగ్గించబడటంతో, EMIలు తక్కువగా చెల్లించాల్సి వస్తుంది. దీని వలన కుటుంబానికి ఆర్థికంగా ఊరట లభిస్తుంది.
ఇంటి కలను నిజం చేసుకోవాలనుకునే వారికి ఇది బంగారు అవకాశం అని చెప్పాలి. భవిష్యత్తులో ఇలాంటి వడ్డీ సబ్సిడీ పథకం దొరకకపోవచ్చు. కాబట్టి మీకు ఇంటి కల ఉంటే, తక్షణమే ఈ పథకానికి దరఖాస్తు చేయడం ఉత్తమం. ఈ సబ్సిడీ 12 సంవత్సరాలపాటు లెక్కలోకి తీసుకుంటారు. కాబట్టి ఆలస్యం చేయడం అంటే లాభం కోల్పోవడమే.
మొత్తానికి, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) పథకం పేద, మధ్యతరగతి ప్రజల జీవన విధానాన్ని మార్చే పథకంగా నిలుస్తోంది. EMIలు తగ్గడంతో కుటుంబాల ఆర్థిక భారాలు తగ్గుతాయి. ఇల్లు అనే జీవితకాల స్వప్నం సాకారం అవుతుంది. ఇప్పుడు చేయాల్సింది ఒక్కటే..మీ కలల గృహానికి మొదటి అడుగు వేయడం.


