కాకతీయ, నేషనల్ డెస్క్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను వేల కోట్లు మోసం చేసి లండన్ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్ కు అప్పగించే ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. అతన్ని భారత్ కు రప్పించేందుకు మార్గం సుగుమమైందని తెలుస్తోంది. నవంబర్ 23న నీరవ్ ను భారత అధికారులకు అప్పగించే ఛాన్స్ ఉందని జాతీయ మీడియా కథనాలు తెలిపాయి.
భారత ప్రభుత్వం బ్రిటిష్ అధికారులకు అప్పగింత ప్రక్రియకు సంబంధించి ఇటీవల ఓ హామీ పత్రాన్ని కూడా సమర్పించింది. నీరవ్ మోదీని భారత్ కు తీసుకువచ్చిన తర్వాత కేవలం మోసం, మనీలాండరింగ్ కేసుల్లో మాత్రమే విచారణ జరుపుతామని ఇతర కస్టడీకి అప్పగించబోమని ఆ పత్రంలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
సీబీఐ, ఈడీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ , కస్టమ్స్, ఆదాయపు పన్ను విభాగం సంయుక్తంగా ఈ హామీ పత్రాన్ని అందించాయి. భారత్ కు అప్పగించిన తర్వాత నీరవ్ మోదీని ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉంచుతారని..హై ప్రొఫైల్ ఖైదీలకు లభించే అన్ని సౌకర్యాలను కల్పిస్తారని పత్రంలో హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
తన అప్పగింత ప్రక్రియను సవాల్ చేస్తూ నీరవ్ మోదీ ఇటీవల మరోసారి లండన్ కోర్టును ఆశ్రయించారు. తనను భారత్ కు అప్పగిస్తే దేశంలోని అనేక విచారణ సంస్థలు దర్యాప్తు పేరుతో చిత్రహింసలకు గురిచేస్తాయని తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ కేసు మొత్తాన్ని తిరిగి ప్రారంభించాని నీరవ్ మోదీ అభ్యర్థించారు. లండన్ కోర్టు ఈ పిటిషన్ను పరిగణలోనికి తీసుకుంది.
ఈ నేపథ్యంలోనే భారత దర్యాప్తు సంస్థలు హామీ పత్రాన్ని సమర్పించగా..దీన్ని పరిశీలించిన న్యాయస్థానం నవంబర్ 23న తదుపరి విచారణ సమయంలో అతన్ని భారత్ కు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు సదరు కథనాలు తెలిపాయి. తప్పుడు ఎల్ వోయూలతో పీఎన్బీని నీరవ్ మోసం చేసిన వ్యవహారం 2018 జనవరిలో వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ కుంభకోణంపై ఈడీ, సీబీఐ దర్యాప్తు చేపట్టాయి. అయితే అప్పటికే నీరవ్ దేశం విడిచి పారిపోయారు. ఈడీ అతన్ని పరారైన ఆర్థిక నేరగాడిగా ప్రకటించింది.
2018 డిసెంబర్ లో నీరవ్ తమ దేశంలో నివసిస్తున్నాడని బ్రిటన్ ప్రభుత్వం భారత్ కు తెలిపింది. దీంతో అతన్ని అప్పగించాలని భారత్ విజ్నాప్తి చేసింది. 2019 మార్చిలో నీరవ్ అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అతన్ని భారత్ కు అప్పగించడాన్నికి 2021లో నాటి బ్రిటన్ హోం మంత్రి ప్రీతి పటేల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ నీరవ్ లండన్ హైకోర్టులో అప్పీల్ చేసినప్పటికీ కోర్టు దాన్ని తిరస్కరించింది. బెయిల్ కోసం చాలా సార్లు దరఖాస్తు చేసినప్పటికీ ప్రతిసారీ భంగపాటే ఎదురైంది.


